పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పద్మావతి.

223

నియె, "భర్తప్రాణములు పోయినవెంటనే ప్రేమగల పత్నియొక్క ప్రాణములు బొందినుండి వెడలును. ఇదియె నిజమైన ప్రేమయొక్క లక్షణము. అట్లువెంటనే బొందిని విడువక తరువాత ప్రాణత్యాగము చేయుట యాత్మఘాతయెగాని పత్నీ ధర్మముగాదు."

పద్మావతియొక్క శుద్ధాంతకరణమునుండి వెడలిన యీవాక్యములు ప్రభుపత్ని చెవులకు ములుకులవలెఁ దోఁచగాఁ నామె పద్మావతి తాను నిజమయిన పతివ్రతను అనివెల్లడించుటకై యీడంబములు పలికెనని యెంచి పద్మావతి నామె పరీక్షించి భంగపఱచవలయునని నిశ్చయించెను.

అందుపైఁ గొన్నిరోజు లయినపిదప రాజుతో జయదేవు లరణ్యమున కరుగుట సంభవించెను. అప్పుడు రాజపత్ని తన మంత్రినిం బిలిచి తనకుట్ర యభిప్రాయ మాతనికిఁ దెలిపి తదనుసారముగా కార్యము నిర్వహింప నాతనిని నియమించెను. అట్లు కుతంత్రము పన్ని యా రాజకాంత యారోజునఁ గూడఁ దన నియమప్రకారము పద్మావతి గృహమున కరిగి యామెతోఁ బ్రసంగించుచుండెను! అంతలో దూతిక యొకత యతి దీనవదనయై వచ్చి కారడవిలో నాకస్మికముగా జయదేవుఁడు పులినోటఁ బడి ప్రాణములను విడిచెనని గద్గదస్వరముతోఁ జెప్పెను! ఆ పిడుగువంటివార్త చెవిసోఁకినతోడనే పద్మావతి నిశ్చేష్టితయై కొంతవడి దేహము తెలియకుండి మరల దేహస్మారకము గలిగి దు:ఖాతిరేకము పట్టఁజాలక పతినామము నుచ్చరించి మరణ తుల్యమగు మూర్ఛనొందెను. కాని యచ్చటి వారందఱును నామె మృతిఁజెందెనని యనుకొనిరి.