పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విమల.

215

యం దధిక ప్రేమ గలదియయి పతివ్రతాధర్మములను దప్పక నడుపుచుండెను.

అంతఁ గొన్నిదినములకు ఘూర్జరదేశపు ఖ్యాతినివిని [1] కళ్యాణాధిపతి దానిపైకి దాడివెడలివచ్చెను. కాని సురపాలునివంటి శౌర్యనిధి సేనాదియగుటవలన నతనిబలంబులు ధైర్యంబు లుడిగి మరల తనదేశమున కరుగవలసినవాఁ డాయెను. తన యపజయమునకు సురపాలుఁడే గారణుఁడుగాన నతనిని జయశిఖరుని సమీపమునుండి చీలఁ దీయవలయునని తలఁచి కళ్యాణరాజు "నీవు జయశిఖరుని విడిచిపోయినచో విశేష ధనమిచ్చెద" ననియు, "రాజ్యమిచ్చెద" ననియు నాసచూపి సురపాలున కొక జాబునువ్రాసెను. ఆజాబొక భృత్యుఁడు తెచ్చి విమలతోనున్న సురపాలుని కిచ్చెను. అతఁడు దానిం జదివికొని మిగుల క్రోధము గలవాఁ డయ్యెను. కాని తనపత్నినిఁ బరీక్షింప సమయ మిదియే. యని తలఁచి యామె కాసంగతిఁ దెలిసి "నీవు మిగుల వైభవముగ రాణివయిభోగముల ననుభవించెదవా! నే నీయుత్తర ప్రకారము చేసెద" నని చెప్పెను. అదివిని మిగుల తిరస్కారముగా నిట్లనియె 'నీవు సత్యవ్రతుఁడవనియు, కృతజ్ఞుఁడవనియు, ననుకొని నిన్ను వివాహమాడితినేగాని, యిట్టి కృతఘ్నుఁడవని తెలియకుంటిని. నేనిదివఱ కెన్నఁడును దుస్సాంగత్యము చేయ లేదు ముందును చేయను. మీరు మీతలఁచినట్లు చేయుదురేని మీకును నాకును ఋణ మింతటితోనే సరి. సతిపతినే దైవముగాఁ జూడవలెను. పతి దుష్కార్యము చేయుమని నపుడు

  1. ఇతఁడు కళ్యాణపురమున స్థాపింపఁబడిన పశ్చిమ చాళుక్యవంశములోనివాఁడయి యుండవచ్చును.