తారాబాయి
మహారాష్ట్రరాజ్య సంస్థాపకుఁడయిన శివాజీకిఁ బుత్రుఁడగు రాజారామున కీమె జ్యేష్ఠభార్య. తారాబాయి రాజ్యపాలనము నందు బహు నిపుణురాలని ప్రసిద్ధిఁగాంచెను. శివాజీ మరణానంతరము కొన్నిదినము లాతని ప్రధమ పుత్రుఁడగు సంభాజీ రాజ్యముచేసెను. కాని కొన్ని రోజులకు సంభాజీని డిల్లీశ్వరుఁడగు ఔరంగ జేబుపట్టుకొనిపోయి బహుక్రూరముగా వధియించి యాతనిపుత్రునిని భార్యను తనయొద్దనే కైదులో నుంచెను. కాన సంబాజీ తమ్ముఁడగు రాజారాము రాజ్యము పాలింపుచునుండెను. రాజారాము పరిపాలనదినములు ప్రజల కతిసంతోషకరములై యుండెను. కాని క్రీ. శ. 1700 వ సంవత్సరమునం దతఁడు దీర్ఘ వ్యాధిచే మృతుఁ డగుట తటస్థించెను. మరణకాలమునందు రాజారామునకు జ్యేష్ఠభార్యయగు తారాబాయియందుఁ గలిగిన శివాజీయను 10 సంవత్సరముల పుత్రుఁడును, ద్వితీయభార్యయగు రాజసాబాయి యందుద్భవించిన సంభాజీయను 3 సంవత్సరముల సుతుఁడునునుండిరి.
రాజారాముగారి యనంతరమునందు తారాబాయి తనపుత్రునిని సింహాసనమునం దునిచి, తాను రామచంద్రపంతు, శంకరాజీ, నారాయణ, దనాజీ, జాధవ్ మొదలగు ప్రధానుల సహాయమున రాజ్యము చేయుచుండెను. ఆమె యొక్కస్థలముననే కూర్చుండియుండక ప్రతికోటకును దానే