168
అబలాసచ్చరిత్ర రత్నమాల.
దు:ఖమును జూడనోప. కాన నగ్నికుండములో దుమికి ప్రాణములను విడిచి నాఖేదమును బాపుకొనియెదను. తన ప్రజలు సుఖులై రాత్రి నిద్రింపఁగాఁ జూచి సంతోషించు రాజెంత ధన్యుఁడో! ప్రాణేశ్వరి! మన కిట్టిదురవస్థ కలుగుట కెట్టిఘోరపాతకము చేసితిమో చెప్పుము.
ఇట్లువాక్రుచ్చియానరేంద్రుఁడు మూర్ఛితుఁడయి నేలం బడియెను. అంతకుముం దంతయు భర్తవాక్యములను చెవియొగ్గి వినుచున్న వాక్పుష్ట తన నాధుండు తుదివాక్యము నుచ్చరించి మూర్ఛిలుటఁ గని తాను ధైర్య మవలంబించి శైత్యోపచారముల నతనిని సేదఁదేర్చి యతనితో నిట్లనియె. "తా మింత శోకమునకుఁ జోటేల యొసంగెదరు! ఇట్టి సమయమున ధైర్యము విడుచుట యుచితమా? ఇట్టిసమయమున నదైర్యపడిన నింక తమయాధిక్య మెట్లు నిలుచును? తమ రజ్ఞానులవలె దిగులొందిన మేమిలాభము? ఇంద్రుఁడు గాని, బ్రహ్మగాని, యముఁడుగాని, మరియేదైవముగాని సత్యశీలుఁడగు రాజును జెఱుపఁ జాలఁడు. రాజు ప్రజలకు పితృతుల్యుఁడు, చావసిద్ధముగా నున్నసుతులను విడిచిపోవుట తండ్రికిఁ దగదు. పతిభక్తికలిగియుండుట సతులకర్తవ్యము. అట్లే విపన్నులగు ప్రజలను విడువకుండుట భూపాలుని కర్తవ్యంబు. ఆత్మహత్యచేసి కొనుట గొప్పపాతకములలో నొకటిగా నెన్నఁబడును. అట్టిపాతకమున కొడిఁగట్టుట మిగుల నధర్మము. ఆశాంకురము నెప్పుడును చంపఁగూడదు. ఒక్కప్రాణియైనను జీవించి యుండినంతవఱకు ప్రాణత్యాగముచేయనిశ్చయించుట యుచితముగాదు. మనము బ్రతికించుటకును మనల నాశ్రయించుట