పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణీ త్రిపురసుందరి

159

విశేష స్నేహముగా లేనందున నాతఁ డాదేశమునందలి యింగ్లీషువారి యిలాకకుఁ బోవలసినవాఁ డాయెను. [1]

ఈ మహారాణి బహుఖ్యాతిగాను, ఘనతగాను రాజకార్యముల నన్నిఁటిని నిర్వహించుచుండెను. జనులందఱును పర రాజులును మిగులఁ గొనియాడ నీమె బహుదీర్ఘ కాలమువఱకు రాజ్యముఁ జేసెను. బుద్ధిసామర్థ్యము విషయముననే గాకుండ సద్గుణములనుగుఱించియు నీమె విఖ్యాతిఁ జెందెనని చరిత్రకారులు వ్రాసియున్నారు. మతిభ్రమబాగయిన పిదప నీమె పెనిమిటివచ్చి మరలఁ గొన్నిరోజులు రాజ్యము చేసెను. అప్పుడును నీమె భర్తసేవయందుఁ దత్పరురాలయి యుండెను. ఈమె పెనిమిటి 1805 వ సంవత్సరములోఁ గాలముచేసెను. తదనంతర మీమె భీమసేనుఁ డనువానిని మంత్రిగా నేర్పఱచుకొని మిక్కిలి చాతుర్యముతోఁ జక్కఁగా రాజ్యపరిపాలనము చేసెను. ఈమె 1832 వ సంవత్సరములో మృతిఁ జెందెను. పతిచేఁ దిరస్కరింపఁబడియు, సవతులచే నవమానింపఁబడియు, పాతివ్రత్యము, క్షాత్రగుణము మొదలయిన సద్గుణములను వదలక ధైర్యముతోనుండి యోగ్యమైన తనహక్కులను శౌర్యముచే సంపాదించుకొని, శత్రులనుగూడ దయార్ద్రదృష్టితోఁ జూచుచు జనులు గొనియాడ రాజ్యపరిపాలనము చేసిన యీసతీమణిని నెవరు గొనియాడక యుందురు?

  1. హిందూదేశములోని ప్రాంతముల నొక్క నేపాళదేశము స్వతంత్రతగలదియై యున్నదనినమాట చదువరులకుఁ దెలిసియేయుండును. ప్రస్తుత మింగ్లీషువారును, నేపాళమువారును నన్యోన్యస్నేహభావముతో నుండుట యెంతయు శ్లాఘనీయము గదా!