పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

అబలాసచ్చరిత్ర రత్నమాల.

లామెను దమ కిమ్మని కోరుచు వర్తమానము లంపిరి. డిల్లీపతియగు పృధివీరా జామె రూపగుణములను విని యామెను నెటులయిన జేపట్ట నిశ్చయించెను. సంయుక్తయు ననేకపర్యాయములు పృధివీరాజు పరాక్రమములను విని రూపము చూచి యున్నందువలన నాతని నే వరించెదనని మనంబున నిశ్చయించుకొనియెను జయచంద్రుడు తనకూతునకు దగినవరుడు దొరక వలయునని స్వయంవరము చేయనెంచెను. పుత్రికవివాహమునకు బూర్వము రాజసూయము చేయ నిశ్చయించి సకల దిక్కుల రాజులకును వర్తమానము లంపెను. జయచంద్రుడు పరాక్రమవంతు డగుట వలన నితరమాండలిక రాజు లంద ఱాయన పిలిచినదినమునకు వచ్చి కనోజనగరము నలంకరించిరి. పృధివీరాజు మాత్రము జయచంద్రునితో గల పూర్వవైరమువలన నాయుత్సవమునకు రాకుండెను. అందునకు జయచంద్రుడు మిగుల కోపించి యాతనితో గలవైరమువలన, పృధివీరాజు ప్రతిమ నొక దానిని జేయించి యాప్రతిమను ద్వారపాలకుని స్థలమునందుంచి, తనపగ సాధించెను. యజ్ఞము విధిప్రకారము జరిగినపిదప స్వయంవరోత్సవ మారంభమయ్యెను. అప్పు డనేక దేశాధీశు లొకచోట నానందముగా గూడినందున కనౌజపట్టణము మిగుల నందముగా గానిపించెను.

రాజాజ్ఞప్రకారము మంత్రులు మండపము నలంకరించి రాజుల నందఱిని వారి వారికి దగుస్థానముల గూర్చుండబెట్టిరి. అటుపిమ్మట సంయుక్తచేత బుష్పమాలను ధరియించి సఖీసహితమయి యామండపమునకు వచ్చెను. రాజకన్య సభకు రాగానే రాజపుత్రు లందఱి చూపులు నామెవైపునకే మరలెను. ప్రతి