పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణీఝాశీ లక్ష్మీబాయి

139

చుట కెంతమాత్రము ప్రయాసము కాలేదు. పేష్వాగా రంతటితోఁ దాము సార్వభౌముల మయితిమని తలఁచి పట్టాభిషేక మహోత్సవము గావించుకొని బ్రాహ్మణసంతర్పణలు చేయసాగిరి. లక్ష్మీబాయి యివన్నియు రాజ్యనాశన హేతువులనియు, ఈయాడంబరమును వదలి సైన్యపు బందోబస్తు చక్కఁగాఁ జేసి యుద్ధసనద్ధులమయి యుండవలసిన దనియుఁ జెప్పెను. కాని యవి స్త్రీవాక్యములని పేష్వాగారును, ఆయన సేనా నాయకుఁ డగు తాత్యాటోపేగారును మన్నింపకమహోత్సవములలోను, బ్రాహ్మణ సంతర్పణములలోను మునిఁగి యుండిరి.

జూన్ నెల 16 వ తేదిని సర్ హ్యూరోజ్ గారు సైన్య సహితులయి బహాద్దరు పురము చేరిరి. కాని భోగపరాయణులగు పేష్వాగారి కాసంగతియే తెలియకుండెను. ఆంగ్లేయసేనానాయకు లచటినుండి మురారీకోట చేకొనిరని వినియును పేష్వాగారు చింతదక్కి పుణ్యకృత్యములు చేయుచునేయుండిరి. ఆయన యనుజ్ఞ వడిసి తాత్యాటోపే సైన్యవ్యవస్థ చేయురీతి గానక లక్ష్మీబాయి గారిని వేఁడుకొనెను. జయము కలుగు నాసలేదని తెలిసికొనియు రాణిగారు సమరమునఁ దెగి స్వర్గముఁ గాంచ నపేక్షించి యాయన మనవి చిత్తగించెను. తదనంతర మామె కొంతసైన్యమును చక్కఁబఱచి మిగత నితర సేనానాయకులును జూడని యమించెను. ఆమెతన సేన ననేక భాగములు విభజించి మిగుల భద్రముగా యుద్ధసన్నద్ధురాలై నిలిచెను. ఇతర సైన్యాధిపతులును తమతమ శక్త్యనుసారముగా