పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

అబలాసచ్చరిత్ర రత్నమాల.

వారును రాణిగారి శుభమునే కాంక్షింపుచుండిరి. లక్ష్మీబాయిగారికి పురుషవేషముతో దరబారుచేయుట, అశ్వారోహణము చేయుట మిగుల ప్రియము. కాన నామె యనేకసమయముల యందుఁ బురుష వేషముతోడనే యుండుచుండెను. సాధారణముగా నామె స్త్రీవేషముతో నుండినను అలంకారము లేమియు ధరియింపక స్వేతవస్త్రము నే కట్టుకొనుచుండెను.

రాణిగారికి బీదలపై నధికప్రేమ యుండెను. ఒకనాఁడామె మహాలక్ష్మీదర్శనమునకుఁ బోయి వచ్చునపుడు కొందఱు బీదలు మూఁకలుగా నామె నడ్డగించిరి. దానికారణ మడుగఁగా వారు మిక్కిలి చలివలన బాధపడుచుండినందున వస్త్రదానము నపేక్షించి వచ్చిరని రాణిగారికి దెలిసెను. అందుపై నామె వా రందఱిని టోపీలు, అంగీలు, గొంగళ్లు మొదలగునవి యిప్పించెను.

మధ్య హిందూస్థానమంతయు నించుమించుగా బందిపోటు సైన్యముల స్వాధీనమయినందున నప్పటి హిందూస్థానపు గవర్నర్ జనరల్ లార్డు క్యానింగు దొరగారు ఇంగ్లండు దొరతనమువారి యనుమతిఁగొని యింగ్లండునందలియు, హిందూస్థానమునందలియు ప్రవీణులగు సేనానాయకులను రప్పించి రాజభక్తిగల యితర సైన్యములను, సహాయార్థ మరుదెంచిన యితర భూపతుల సైన్యములను వారిపరముచేసి యాప్రచండ సేనను నడుపుటకు యుద్ధకళావిశారదుఁడగు సర్ హ్యూరోజ్ దొరగారిని నియమించి ఆయనకు సర్వసేనాధిపత్య మిచ్చెను.

1857 డిసంబరు 17 వ తేదిని సర్ హ్యూరోజ్ దొరగారు సేనానాయకత్వము స్వీకరించిరి. యుద్ధమునకుఁ