డాక్టరు ఆనందీబాయి జోశి
115
దేశముయొక్కయు, స్త్రీలయొక్కయు దురదృష్టమువలనఁ జదువుకొనుకాలముననే యామెకు క్షయరోగ మంకురించి క్రమముగా వృద్ధియగుచుండెను. రోగముతోడనే యామె మనదేశమునకు వచ్చెను. సముద్రప్రయాణమువలన నామె దేహము మఱింత యస్వస్థ మయ్యెను. బొంబాయియందును, పూనాయందును, ఆమెకు ఔషధోపచారము లనేకములుచేసి చూచిరి కాని ఫలము లేక పోయెను. తుదకు 1887 వ సంవత్సరము ఫిబ్రవరి 26 వ తేది రాత్రి పదిగంటలకుఁ దా జన్మించిన పూనాయందే యీయద్వితీయస్త్రీ పరలోకమున కేగెను. మరణకాలమున "నాచేత నయినంతవఱకు నేనుచేసితి"నని పలికి యామె ప్రాణముల విడిచెను.
చూచితిరా? యీధైర్యవతి సాహసము! ఇట్టిరత్నము లనేకములు మనదేశమునందుఁ గలవు. కాని యారత్నములను సానఁబెట్టి ప్రకాశింపఁజేయుటకు గోపాలరావు వంటివారు లేనందున నారత్నములును రాళ్ళవలె కానిపించుచున్నవి. ఆనందీబాయి సద్గుణములకును, సద్విద్యకును, గోపాలరావే మూలకారణుఁ డనుట కెంతమాత్రము సందేహములేదు. సాధారణముగా మొగపిల్లలును ఆఁడుపిల్లలును వారి చిన్న తనపు చేష్టల వలన మిగుల చెడ్డవారని యనిపించుకొందురు. పురుషులు విద్యనేర్చిన పిదప తమ యజ్ఞానమును కొంతవఱకు విడిచి మంచివా రగుదురు. స్త్రీలో, విద్య నేర్పువారు లేక యింటి యందుఁ దల్లి ముత్తవ మొదలగువారివలెనె జ్ఞానవంతులును సుగుణదుర్గుణములు కలవారును నగుదురు. ఆనందీబాయి చిన్న తనమునందు మిగుల చెడ్డదిగాఁ గానుపించు చుండెను గాని