"విద్యాసాగరుడు మహూన్నత పదవియందుండి తన సత్పాత్రదానమువలన వంగదేశమున కొక కష్టము రాకుండ గాపాడుచున్న సమయమునందొకనాడు శ్రీభగవతీదేవిని సందర్శించుటకై యొక బాలవితంతువు వచ్చియుండెను. ఆమె శ్రీభగవతీదేవిని దర్శించి సంభాషణవశమున దన నిర్బంధ వైధవ్యదశను గూర్చి దు:ఖముతో నించుక ముచ్చటించెను. ఆర్తత్రాణపరాయణత్వమును వహించిన భగవతీదేవి యామె కష్టమును వినగానే పట్టజాలని దు:ఖముతో దన కుమారునివద్దకు బారివచ్చి "కుమారా! నీవు సమస్తశాస్త్రములను జదివితివిగదా, ఆపన్నులయిన బాలవితంతువులను సంరక్షించు శాస్త్రమేదియును నీకు గానుపించ లేదా?" అని యడిగెను.
"విద్యాసాగరునికి దన తల్లియందతి గౌరవము గలదు. అతడు తన యౌన్నత్యము నంతను జిన్ననాడు తన కామె కరపిన సద్గుణపుంజమువలన నందియుండెను. దు:ఖముతోనట్లు తనతల్లి చెప్పిన మాటలను వినగానే విద్యాసాగరుడు తిరిగి శాస్త్రములను జదువుట కారంభించి తుట్టతుదకు బరాశర స్మృతి యందు స్త్రీ పునర్వివాహములు తప్పక జరుపబడవలెనని విధించు నీ క్రింది వాక్యమును గాంచెను."
"నష్టే మృతే ప్రవ్రజతే క్లీబే చ పతితే పతౌ
పంచస్వాపత్సు నారీణాం పతి రన్యో విధీయతే."
"తన కుమారుడు స్త్రీపునర్వివాహములను జేయ నారంభించిన తరువాత నాతనికి బహువిధముల ధైర్యము నొసంగుచు