దమనాయకుడు భంగపడుట చూచి యితరులందరు గ్రోధావేశ పరవశులై యా యబలపైకి నురికిరి. వారంద రిట్లొక్కసారి పేర్చి యూర్చిన వీరమతి వారితో బోరాడెనుగాని, యావరకు ఖడ్గము త్రిప్పి త్రిప్పి యలసి యున్నందున నా ఘోరకలహములో నాచేతిపట్టు బడి ఖడ్గము క్రిందబడెను. దానిని తీసికొనుటకై ఆమె ప్రయత్నించు నంతలో రెండుబాణములు వచ్చి యొకటి యామె కాలికిని, మరియొకటి యామె చేతికిని తగిలెను. వానిని దీయుటకై యత్నించుచుండ నొకడు వెనుక నుండి వచ్చి యామె మెడబట్టుకొనెను. ఇందుపై నామె మూర్ఛిల్లెను గాని, యింతలో జగదేవుడు తన ఖడ్గముచే నా దుర్మార్గుని రెండుచేతులును దునిమి తన ప్రియభార్యను విడిపించుకొనెను. ఇక జగదేవునకు మూర్ఛిల్లిన భార్యను రక్షించుకొనుటయు, శత్రువులతో యుద్ధము చేయుటయునను రెండు పనులు చేయవలసివచ్చెను. ఇట్లు జగదేవుడు తన శౌర్యమంతయు జూపుచుండగా ధీరసింహుడిరువది గుర్రపురౌతులతో నదేమార్గమున వచ్చుట సంభవించెను. ఆయన జగదేవుని గుర్తెరిగి యా దొంగల నందరిని కైదు చేసెను. తరువాత ధీరసింగు గుర్రముదిగి జగదేవుని గౌగిలించుకొని, అతనిచే దొంగల వృత్తాంతమంతయు విని మూర్ఛిల్లియున్నది వీరమతి యని తెలిసికొని యామెకు శీతోపచారములు చేయించి, గాయములకు గట్లు కట్టించెను. అంత నామె స్మృతినొంది లేచి, ధీరసింగును చూచి యతనికి మ్రొక్కెను. తరువాత వారందరును ఆ రోజున నచ్చటనే కూడి భోజనాదులు చేసిరి. భోజనోత్తరము ధీరసింగు జగదేవునితో నిట్టులనియె "ఇది యంతయు వాఘేలి