దిత్య మహారాజుగారికి రెండవకుమారుడగు జగదేవు డిరువది దినముల క్రిందట నేకారణమువలనో యింటినుండి బయలుదేరి యెవరికి జెప్పక యెచ్చటికో పోయినాడు. అతనితల్లియగు సోళంకిరాణి యతనిని వెదకుట కయి ధీరసింహుడను మంత్రిని బంపినది. మేము ధారానగరమువద్ద నున్నయొక పల్లెలోనివారము. ప్రవాసములో నందరికంటె ముందుపోయి భోజన ప్రయత్నము చేయుట కయి ధీరసింహుడు మమ్ము వెంబడి తెచ్చినాడు. నిన్నిటిరోజు మేము ధీరసింహునకంటె మొదట బయలుదేరి ముందటిగ్రామమునకు బోవుచుండగా త్రోవతప్పి యీ యడవిలోకి వచ్చి పెద్దపులులచే బాధితుల మయితిమి." ఇట్లు వారిచే దనతల్లి క్షేమసమాచారమును, తనను వెదకుట కయు తనతల్లి గారు తన కత్యంతప్రియుడగు ధీరసింహుని బంపిన దనియును విని, జగదేవు డత్యంత ముదితుడయి ధీరసింహు డెచ్చట నున్నవాడో యచ్చటికి దీసికొనిపొండని వారి నాజ్ఞాపించెను. వారిలో నొకడు ముందు, నడుమగుర్రముపయి, జగదేవవీరమతులు వారి వెనుక నింకొక సేవకుడు, ఇట్లు నడుచుచు కొంతదూరము వెళ్లిన తరువాత వారికి నెవరో గుర్రపురౌతులు, ఎనిమిది పదిమంది యెదురుగా వచ్చుచున్నట్లు గానిపించిరి. వారు ధీరసింహుని మనుష్యులేయని నమ్మి జగదేవాదులు వారిరాకకు నెదురు చూచుచు నిలవబడిరి. కాని కొంతసేపటికి వచ్చెడి వారు తమకు మిత్రులుగాక, యెవరో శత్రువులని తెలిసెను. అప్పుడు జగదేవవీరమతులు శస్త్రాస్త్రములను సవరించుకొని యుద్ధమునకు సన్నద్ధులయిరి. వారివెంబడి నున్న సేవ