నదికాదు. ఇంతలో శత్రుసైనికులు కొందరామెను చేరరాగా నాయువతి మిగుల శౌర్యముతో వారిలో ననేకుల నంతక పురంబున కనిచెను! వారు బహుజనులును ఈమె యొంటరిది కాన వారిలో నొక డామె వాలునకు జంకక పక్కగా నిలిచి యామె తల కుడివైపుగా నరికెను. బంధింపబడిన సింహముపై మత్తగజమాడున ట్లాభటుడు చేసిన ఖడ్గప్రహారమువలన నామె తల కుడివైపంతయు తరగబడి రక్తము ప్రవహింపసాగెను. ఇంతలో నాయాశ్వికుడు తనఖడ్గము రాణిగారి యురమునందు గ్రుచ్చెను. పురుషవేషముతో నుండుటవలన నీమె రాణిగారని పగవారికి గుర్తింప రాకున్నను, శత్రుపక్షమునందలి యొకానొక సైన్యాధిపతియగునని వారికి దోచెను. ఈదెబ్బతో రాణిగా రాసన్నస్థితిని బొందెను. కాని యావీరయువతి యట్టి సమయమునందను ధైర్యము విడువక తన నట్టిస్థితికి దెచ్చిన యాశ్వికుని బరలోకమున కనిచెను!
ఇట్లామె వానినిజంపి బొత్తుగా శక్తిహీనమయ్యెను. అంతవర కామెను విడువకున్న రామచంద్రరావు దేశముఖు సగము ముఖము కోయబడిన రాణిగారిని శత్రువులచేత బడకుండ సమీపమునందున్న పర్ణకుటిలోనికి గొని చనెను. ఆయన మిగుల దు:ఖించి రాణిగారికి నుపచారములు చేయుచుండెను. కాని 1858 వ సంవత్సరము జూను నెల 18 వ తేదీని అద్వితీయశౌర్యగుణమండితు రాలగు ఝాశీ మహారాణి లక్ష్మీబాయిగా రీలోకమును విడిచి శాశ్వతసుఖప్రదమగు లోకమున కరిగెను. రామచంద్రరావు దేశముఖుగారును రాణిగారి యాజ్ఞ