పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దెలుపగా నాతడు సమ్మతించెను. లగ్ననిశ్చయమైన పిదప గొందఱాప్తులతో మోరోపంతుగారు ఝాశీకివెళ్ళిరి. అచటనే 1842 వ సంవత్సరమున మనూబాయి వివాహము మిగుల వైభవముతో జరిగెను. వివాహానంతరమునందు దేశాచారప్రకారము అత్తవారాచిన్నదానికి 'లక్ష్మీబాయి' యను పేరు పెట్టిరి. మామగారగు మోరోపంతు తాంబేగారికి 300 రూపాయల వేతనమిచ్చి గంగాధరరావుగారు తమ యాస్థానమునందొక సరదారుగా నుంచినందున లక్ష్మీబాయి మరల బ్రహ్మావర్తమున కరుగుట తటస్థించినదికాదు.

గంగాధరరావుగారి యన్నగారగు రఘునాథరావుగారి పరిపాలనలో రాజ్యము విశేష దుస్థితికి వచ్చినందున నారాజ్యాధికారమును పూర్ణముగా దొరతనమువారే స్వాధీనపరచుకొని రాజ్యమునకు గల ఋణములను దీర్చుచుండిరి. లక్ష్మీబాయి వివాహానంతరము గంగాధరరావుగారి యోగ్యతనుగని బుందేలుఖండుయొక్క పొలిటికల్ యేజంటగు కర్నల్ స్లీమన్ దొరగారు సర్వరాజ్య పాలనమును గంగాధరరావు గారి స్వాధీనము చేయించిరి.

గంగాధరరావు తనప్రజలను సుఖులనుగా జేయనెంచి రాజ్యముమ బహునిపుణముగా బాలింపుచుండెను. ఈయన కాలమునందు ఋణము లన్నియు దీరి భాండాగారమున ధనము దినదినాభివృద్ధి బొందుచుండెను. ప్రజలును మిగుల సుఖులై యుండి సదా రాజును, రాణిని దీవింపుచుండిరి.