పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహు సుఖకరముగా గడచెను. ఆభార్యాభర్తలిరువురును పరస్పరాను రాగముగలవారై కాసీక్షేత్రమున వసింప గొన్ని దినములకు భాగీరథీబాయి గర్భముధరించి 1835 వ సంవత్సరము నవంబరునెల 19 వ తేదిని సుఖప్రసవమై స్త్రీశిశువును గనెను. తాంబేగారి శూరవంశమున గాశీ క్షేత్రమున జన్మించిన కన్యారత్నమే లక్ష్మీబాయి. జాతకర్మ నామకరణమహోత్సవములు బహుసంతోషముతో నడిపి మోరోపంతుగా రాచిన్నదానిపేరు "మనూబాయి" యని పెట్టిరి. ఈబాలిక దినదినప్రవర్థమానయగుచు దనముద్దు మాటలవలనను, మనోహర మగుస్వరూపమువలనను జననీ జనకులను, వారి పరివారమును మిగుల నానందపరుపుచుండెను. ఇట్లీబాలికా రత్నంబు సకల జనాహ్లాదకరంబుగా బెరుగుచుండ నామె మూడు నాలుగు సంవత్సరములదియగువరకు తన్మాత యగు భాగీరథీబాయి పరలోకగతురాలాయెను. ఈసమయముననే యప్పాగారును కైలాసవాసులగుటవలన మోరోపంతుగా రచటనుండి బ్రహ్మావర్తమునకు బోవ తటస్థించెను. అచట బాజీరావీయనను మిగుల ప్రేమించి కుటుంబసంరక్షణ చేయుచుండెను.

మనూ బాయికి బాల్యముననే జననీ వియోగము తటస్థించినందున నామె తండ్రిగారి పోషణలోనే యుండుచు, నెల్లప్పుడు ఆయననువిడువక పురుషులలోనె సదా తిరుగుచుండెను. తల్లిలేని పిల్లయగుటవలనను, సుస్వరూప మధురభాషిణి యగుటవలనను శ్రీమంతులవద్ద నుండువా రందరును మనూబాయిని మిగుల గారాబము చేయుచుండిరి. పేష్వాగారి దత్త