పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యాధికారము దొరకెను. ఈయన పరిపాలన కాలములో పేష్వాల రాజ్యాధికారమెల్ల నింగ్లీషువారి యధీనమయినందున ఝాశీ సంస్థానాధీశునితో నాంగ్లేయప్రభుత్వమువారికి విశేష స్నేహ భావముగలిగెను. ఈయన పుత్రహీనుడగుటవలన నాయనంతర మాయనపినతండ్రియగు రఘునాథరావు, ఆయన యనంతర మాయనతమ్ముడగు గంగాధరరావును రాజ్యమును పాలించిరి. ఈగంగాధరరావు చరిత్ర నాయిక యొక్క భర్త.

మోరోపంతు తాంబే యనుకరాడే బ్రాహ్మణుడు పూనానగరమున వసియింపుచుండెను. ఆయనయందు రెండవ బాజీరావు సహోదరుడగు చిమాజీ యప్పాగారికి మిగుల విశ్వాసమును స్నేహమును కలిగియుండెను. 1818 వ సంవత్సరమున 8 లక్షలపించెను పుచ్చుకొని స్వరాజ్యమును ఇంగ్లీషువారికిచ్చినట్టు పత్రము వ్రాసియిచ్చి రెండవబాజీరావు బ్రహ్మావర్తమున వాసముచేయ జనెను. ఆసమయమునందాయన తమ్ముడగు అప్పాగారును తమకు దొరకు పింఛనును సేవకులనుతీసికొని కాశీక్షేత్రమున వసియింప దలచి దొరతనము వారి యనుజ్ఞవడసి కాశీకి బోయిరి. ఆయన పరివారములోనివాడు కాన మోరోపంతుతాంబే సహిత మచటికే చనెను. ఈతనిని శ్రీమంతులగు నప్పాగారికి దివానుగానుంచి, తత్ప్రీత్యర్థము నెలకు ఏబది రూపాయల వేతన మొసంగుచుండిరి.

మోరోపంతుగారి భార్యయగు భాగీరథీబాయి సద్గుణమునందును సౌశీల్యమునందును మిగుల ప్రఖ్యాతి వడసెను. భార్య యిట్టి దగుటవలననే మోరోపంతుగారికి సంసార యాత్ర