Jump to content

పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముత్తువ పోయియుండెను. కాన పిల్ల కేవిధమయిన భయము లేక యుండెను.

అటుపిమ్మట గోపాలరావామెకు విద్యవలన లాభముల నెరింగింపగా నామె మిగుల శ్రద్ధతో ప్రతిదినము తప్పక పాఠములు చదువుచుండెను. ఆమె చురుకుదనమును జూచిన కొలదిని గోపాలరావునకు మరింత యుత్సాహము కలిగి యాతడామెతో ననేకసంగతులను ముచ్చటింపుచుండెను. అందు వలననే ఆనందీబాయికి త్వరగా విద్యాసక్తి గలిగెను. పెండ్లియైన పిదప రెండు సంవత్సరములలో ఆనందీబాయికి మహారాష్ట్రభాష చక్కగా జదువుటకును, వ్రాయుటకును వచ్చెను. అంతలో నామె కా భాషయందలి వ్యాకరణము, భూగోళము, ప్రకృతిశాస్త్రము, గణితశాస్త్రము మొదలయినవి గోపాలరావుగారు చక్కగా నేర్పిరి. అల్లీ బాగునందుండు కాలముననే ఆనందీబాయి ఋతుమతియైనందున భార్యాభర్తల నొకటి చేసిరి. వెంటనే యానందీబాయి గర్భవతియైనందున నామె కళ్యాణమునకు బోయెను. అచట నామెకు కొమారుడుగలిగి పదియవదినంబుననే చనిపోయెను. కాన ఆనందీబాయికి జిన్నతనముననే పుత్రదు:ఖము గలిగెను. అందువలన గొన్ని దినముల వరకును ఆమె విద్యాభ్యాసమునకు భంగము గలిగెను. కాని యటుపిమ్మట మరల నామెచదువు చక్కగా సాగుచుండెను. కొన్ని దినములలో నామెకు దన మనోగతమును బాగుగావ్రాసి తెలుపునంతటి ప్రజ్ఞ గలిగెను. అల్లీ బాగులోని లోకు లానందీబాయికి వచ్చిన విద్యనుగని యోర్వలేక