విరాబాయి
సంగ్రామే సుభటేంద్రాణాం కవినాం కవిమండలే
దీప్తిర్వాదీప్తిహానిర్వా ముహుర్తాదేవ జాయతే.*
విరాబాయి చితూరు సంస్థానాధీశ్వరునిభార్య. ఈమె అక్బరు బాదుషాకాలము నందుండిననట్లి తిహాసమువలన దెలియుచున్నది. కాని యీమె జన్మమరణ సంవత్సరములును, జననీజనకుల నామములును దెలియు మార్గ మెందును గానరాదు.
విరాబాయి స్వశౌర్యమవలన అక్బరు నోడించి తన భర్తను విడిపించెను. అక్బరు బాదుషా చితూరుపై రెండు పర్యాయములు దండెత్తినను ఫేరిస్తాయను ఇతిహాసకారుడు వ్రాసిన గ్రంథమునం దొకసారి దండువెడలుటయే వర్ణింపబడి యున్నది. స్వజాతీయుడగు బాధుషాయొక్క పరాభవము నాత డెట్లు వ్రాయగలడు? ఒకా నొక రజపూతస్త్రీచే నోడింపబడి పలాయితు డైనందున బాదుషాకీర్తికి సంభవించిన కలంక మగుపడ కుండుటకయి తురుష్కులైన యితిహాసకారు లెవ్వరును చరిత్రములలో నీసంగతి వ్రాయనేలేదు. కాని యాసమయము నందు చితూరుదరబారు నందున్నవారప్పటి యుద్ధమును చక్కగా వర్ణించియున్నారు.
- యుద్ధమునందు వీరుల శౌర్యాశౌర్యములును, కవి సంఘమునందు కవులయొక్క చాతుర్యాచాతుర్యములును ఒకక్షణమాత్రములో వెల్లడియగును.