పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారెవ్వరోయని యనేకు లూహించిరి. కాని సాక్షులు లేనందున దానిని నిశ్చయింపలేకుండిరి. పన్నాదాయి యచటనుండి వెడలి రాజకుమారుని దాచినస్థలమునకరిగి యాబాలుడు ప్రౌడుడగువరకు నాతనిని పోషించెను. ఈ సంగతి యంతయు రజపూతులకు దెలియగా వారు ఉదయసింహుడు పెరిగినపిదప బనబీరుని దేశము వెడలగొట్టి ఉదయసింహునినే రాజునుగా స్వీకరించిరి. ఇట్లొక రాజభక్తిగల యువతివలన సంగ్రామ సింహుని వంశము నిలిచెను. అనేక ప్రజలను గాపాడు ప్రభువు బ్రతికెను. కాన నట్టి యువతికీర్తి భరతఖండమునందంతటను నిండియుండుట వింతగాదు. ఉదయ సింహుడు పన్నాను తల్లినిగా భావించి పూజింపుచుండెను.


_______