పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నది. కాన, నీ ప్రధమదివసంబున తమరు నావిడిదికి దయచేసి నే చేయుపూజల నంగీకరింతురని నమ్ముచున్నాను. ఈ నా చిన్నవిన్నపము మీ రంగీకరింపక తప్పదు. "బాదుషా యొక్క నమ్రత్వమును కని యాతని మాటలనునమ్మి భీమసింహుడు మితపరివారముతో నాతని శిబిరంబునకు బ్రయాణమయ్యెను.

అల్లాఉద్దీను మిగుల దుర్మార్గుడగుటవలన రాజుగారిని నమ్మించి తనతో దోడుకొనివచ్చి, తనశిబిరసమీపమునం దాయనను సైన్యము ముట్టడించి కైదుచేయునట్లు చేసెను. రాజు పట్టుపడుటవలన మిగుల నుప్పొంగి అల్లాఉద్దీన్ చితురున కిట్లు వర్తమాన మంపెను. "పద్మిని నావద్దకు రానియెడల భీమసింహుని ప్రాణములగొని మరల రజపూతులను సంహరించెదను." ఈ సంగతి విని రజపూతులందరు నేమిచేయుటకును దోచక మిగుల విచారముగా నుండిరి.. రాజగు లక్ష్మణసింహుడు బాలుడగుటవలనను, భీమసింహునిపుత్రులు పండ్రెండుగురును అల్పవయస్కు లగుటవలనను, ఇట్టిసమయమునం దగిన యుపాయము యోచించువారు కాన రారయిరి. కాని పద్మినిమాత్ర మప్పుడితర స్త్రీలవలె దు:ఖింపుచు గూర్చుండక మిగుల ధైర్యము వహించి భర్తను విడిపించు నుపాయము యోచింపుచుండెను. ఆసమయమునం దేదోపనిమీద నామె సోదరుడగు గోరాసింహుడును, నాతని పుత్రుడగు బాదలుడను వీరుడును అచటికి వచ్చిరి. ఆమె వారితో యోచించి మిగుల చిత్రమగు యుక్తిని బన్నెను. పద్మిని అల్లా ఉద్దీనున కిట్లు వర్తమానము