పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోరునకు విసుగు కలిగిన రజపూతు లందున కొప్పుకొనిరి. తదనంతర మా సంగతి భీమసింహుడు పద్మినికి దెలుపగా నానె తాను ప్రత్యక్షముగా నామ్లేచ్చునికంట బడనని స్పష్టముగా దెల్పెను. అందుపయి భీమసింహు డామెకు నామె డిల్లీశ్వరునకు గనిపించని పక్షమున రజపూతులకు గలుగు బాధల నెరిగింపగా, నామె యద్ధమునందు దన ప్రతిబింబమును బాదుషాకు జూప నొప్పుకొనెను. అప్పుడు "పద్మిని నీ కగు పడజాలదు; గాన నామె ప్రతిబింబమును జూపెద" మని చిత్తూరునుండి అల్లాఉద్దీనుకు జెప్పి పంపిరి.

అందుపయి యుద్ధము నాపి నియమితదివసంబున నొకరిద్దరు సేవకులతో అల్లాఉద్దీను పద్మినిని జూచుటకయి చితురు కోటలోనికి వచ్చెను. అచట భీమసింహుగా రాయనకు దగుమర్యాదలుచేసి యాతనికి దర్పణంబున పద్మినిరూపమును జూపెను. తాను విన్నదానికంటెను పద్మిని విశేషరూపవతి యగుట గనినందున, బాదుషాయొక్క చిత్తచాంచల్య మినుమడించెను. దానిని మనమునం దడచుకొని యామ్లేచ్ఛప్రభువు మరలిపోవునపుడు తనకృత్యమునకు బశ్చాత్తాపపరుడయి నటుల భీమసింహునితో నిట్టులనియె. "భీమసింగుగారూ! నేను చేసిన నేరమును మన్నించవలయును. నే డాదిగా చిత్తూరు సంస్థానీకులతో నేను సఖ్యము చేయదలచితిని. ఇంతవరకు మీ యోగ్యత తెలియకపోవుటవలన నే వైరము తల పెట్టితిని. కాని నేడు మీ యోగ్యత నా కన్నులార చూడగా మీవంటి మిత్రులు దొరకుట నాకు మిగుల శ్రేయస్కరమని తోచు