పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముదరనందున నప్పటికిమాత్రము గోరికి సాహాయుడు గాకుండెను.

పృథివీరాజు మహాశౌర్యముతో దిలావడియను యెడారియందు గోరీసైన్యముల పలుమారు నోడించెను. పృథివీరాజు పరాక్రమమున కోర్వజాలక తుదకు గోరీ బహుకష్టముతో పలాయితుడయ్యెను. పృథివీరాజును విజయానందముతో నితర సామంతులతో దననగరు బ్రవేశించెను.

పృథివీరాజున కయిన జయమువలన జయచంద్రున కధిక వ్యసనము గలిగి యాతని మనం బెప్పుడును పృథివీరాజు చెరుపునే కోరుచుండెను. అందువలన నాతడెట్టి నీచోపాయము వలన నయినను బృథివీరాజునకు జెరుపుచేయ నిశ్చయించెను. అందువలన నాతడు తన దూతనంపి పారిపోవుచున్న గోరీని మరల మనదేశమునకు గొనివచ్చెను. ఇట్లు రప్పించి యాకుత్సితుడు తా నతనికి దోడుపడుటయేగాక, యితర రాజులనేకులను నీకు దోడు తెత్తునని నమ్మిక దోపబలికి యాతనిని మరల పృథివీరాజు పైకి యుద్ధమునకు బురికొల్పెను.

జయచంద్రుని సహాయమువడసి మిగుల ధైర్యముతో గోరీ మరల డిల్లీనగరముపై దండువెడలెను. జయచంద్రుడు తా నన్నప్రకార మితరరాజుల ననేకులను దనవెంట దీసికొని యా తురష్కునికి దోడుపడెను. ఇట్లు చేసి పృథివీరాజున కిక జయము దొరకదని యా దీర్ఘక్రోధి సంతసింపుచుండెను. దుర్జనులు తమకార్య మీడేరుటవలన దేశమున కంతకును నష్టము కలుగునని తెలిసినను వెనుక దీయరుకదా?