ఈ చరితమునం దనేకాసంభవములైన సంగతు లచ్చటచ్చట గానుపించుచున్నవి. వానిని విడిచినను పూర్వకాలము నందొక స్త్రీ, పురుషులకుగూడ నసాధ్యమగు జ్యోతిర్విద్యనభ్యసించి ప్రవీణత నొందియుండెననియు, ఆమెకు జ్యోతిషము యొక్క యంగములైన జాతక స్కంధమునందును గణిత స్కంధమునందును, అసమానప్రజ్ఞ గలిగియుండినదనియు స్పష్టముగా దెలియుచున్నది. ఖనాయొక్కబుద్ధి యిట్టి గహనవిషయమునందింత సులభముగా బ్రవేశించుట జూడగా, స్త్రీలబుద్ధి పురుషులబుద్ధి కంటె మందమనియు, నాడువారి మెదడు (మస్తిష్కము) మగవారి మెదడున కంటె బలహీనమనియు దక్కువ తూగుననియు నందువలన పురుషులకు దెలిసినంతటిజ్ఞాన మతివలకు దెలియుటసంభవింపదనియు జెప్పువారిమాట లన్నియు బక్షపాత వచనములని నిర్వివాదముగా జెప్పవచ్చును. స్త్రీలు నైసర్గికమూర్ఖురాండ్రని చెప్పుటకంటె నేటివరకు స్త్రీలకు బాల్యమునుండియు విద్యాగంధము నించుక సోకనియ్యనందున వారు మూర్ఖురాండ్రుగా గానుపించెదరని చెప్పవచ్చును. బాల్యమునందు బాలురును బాలికలును సమానబుద్ధివైభవములు గలిగియె యుందురని మనకందరకును దెలిసినమాటయే. బాలురకంటె బాలిక లెప్పుడును బుద్ధిహీనలుగా నుండరు. బాల్యమునం దాడుపిల్ల యెట్టి బుద్ధివైభవము గలదైనను తలిదండ్రులుదాని కెంతమాత్రనుము విద్యనేర్పక జ్ఞానాభివృద్ధికిం దగిన యుపాయములేవియు జేయనందున నది వివేక హీనురాలగుచున్నది. బాలుడు చిన్న తనమునందెంతమందబుద్ధియైనను