దీసికొని పోకుండిన రా జత్యంతాగ్రహపడునని తలచి వరాహుడు ఇందుకు మూలకారణురా లయిన ఖనాను చంపివేసిన బాగుండునని నిశ్చయించెనట! వరాహు డా సంగతి గొమారునకు దెల్పి నీ భార్య నాలుక కోయుమని యాజ్ఞాపించెనట! కాని సద్గుణమణియగు ప్రియభార్య నంత క్రూరతవహించి చంపుటకు మిహిరున కెంతమాత్రమును మన సొప్పకుండెనట! ఈ సంగతి యంతయు ఖనాకు దెలిసి, మామగారి యాజ్ఞను ఉల్లంఘించక శిరసావహించి తన నాలుకను జూపి ఖండింపుమని భర్తను భక్తితో వేడుకొనెనట! అందుపై నాతడు మనసు దృడపరచుకొని ప్రియభార్య యొక్క జిహ్వను ఖడ్గముతో గోసెనట! అందుపై నామె త్వరలోనే యిహలోకము విడిచెనట! కొందరీ కథనే యిట్లు చెప్పుదురు:- విక్రమార్కుని యాజ్ఞప్రకారము ఖనా యాతని సభలోని పదియవ రత్నమయ్యెను. తరువాత గొన్నిరోజులకు గాలధర్మము నొందెను. ఇట్లు చెప్పువారీమె స్వాభావికముగా మానవులందురు. మృతిజెందునట్లుగానే మృతిజెందినదనియు, బరులచే జంపబడలేదనియు జెప్పెదరు. మొదటి కథకంటె నీ రెండవకథయే విశేష సంభవనీయముగా నున్నది. విక్రముని కాలమునందు స్త్రీలకు రాణివాసము లేక యుండెనని యనేక ప్రమాణములవలన గానబడుచున్నది ఇదియుంగాక యంతరాణివాస ముండినయెడల రాజు ఖనాను రాజసభకు దీసికొనిరమ్మని యేల చెప్పియుండును? తన ప్రియభార్యను నిష్కారణముగా మిహిరుడు చంపెనన్న క్రూరపుమాట నమ్మతగినదికాదు. కనుక రెండవకధయే యుక్తియుక్తముగా నున్నది