పుట:Abaddhala veta revised.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విగ్రహం కన్నీరు పెడుతోంది:

"లోకంలో పాపం పెరిగిపోయింది. అది చూడలేక మేరీమాత విగ్రహం కన్నీరు పెట్టుకుంటున్నది. ప్రభువు ఆగ్రహిస్తాడు. పాపం పోగొట్టుకోవాలి" అని క్రైస్తవ ఫాదర్ బోధిస్తున్నాడు. మేరీమాత విగ్రహం కన్నీళ్ళు పెడుతుందనే వార్త పత్రికలలో వచ్చింది. భక్తజనం తండోపతండాలుగా వచ్చి అద్భుతాన్ని తిలకించి, కానుకలు సమర్పించారు. ప్రార్థనలు చేశారు. క్షమించమని వేడుకున్నారు. ఒకరోజు కన్నీరు పెట్టుకున్న విగ్రహం మరునాడు ఆపేసింది. ఈలోగా వచ్చిన కానుకల్ని దైవకార్యం నిమిత్తం ఫాదర్ స్వీకరించాడు.

మాంత్రికుడు జేమ్స్ రాండి(అమెరికా)కి వార్త తెలిసివచ్చాడు. విగ్రహాన్ని పరిశీలిస్తానన్నాడు. వీల్లేదన్నారు. నిజంగా కన్నీరు కారుస్తుంటే, పరిశీలనకు ఆటంకం ఏమిటన్నారు. అయినాసరే ఒప్పుకోలేదు. భక్తుల విశ్వాసాన్ని ప్రశ్నించకూడదన్నారు. హేతువాదులు జేంస్ రాండిని వివరం అడిగారు. విగ్రహాన్ని తరువాత పరిశీలించిన రాండి విపులీకరించి, ఏం జరిగిందో తెలియపరిచాడు.

మేరీమాత విగ్రహం మెడ లోపలిభాగం ఖాళీగావుంది. తలపై చిన్న రంధ్రం పెట్టి నీళ్ళు పోశారు. తలపైముసుగు కప్పారు. విగ్రహం రెండు కళ్ళకూ మైనం పెట్టి, నీళ్ళు పోసినప్పుడు మైనం తొలగించారు. లోన పోసిననీరు బొట్టుబొట్టుగా బయటకు వచ్చింది. మేరీమాత ఏడుస్తున్నట్లు ప్రచారం చేసి,భక్తుల వద్ద కానుకలు స్వీకరించారు.

మైసూరులో చాముండేశ్వరి విగ్రహం యిలాగే ఏడుస్తున్నట్లు లోగడ ఒకసారి ప్రచారం చేశారు. మాంత్రికుడు యీ గుట్టు బయటపెట్టాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహమైతే, లోన ఉప్పునీరుపోస్తే, సన్నని రంధ్రాలనుండి చెమ్మ వస్తుంది. అది కూడా భక్తుల్ని నమ్మించడానికి ప్రచారం చేసేవారు.

విగ్రహాలను తయారుచేసేది మనుషులే. వాటిని పూజించేది మనుషులే. విగ్రహాలను రాళ్ళుగా, బొమ్మలుగా ఆడుకునేది పురోహితవర్గమే.

నీవు బాబా కావచ్చు!(మాతకూడా!)

ఎటుచూచినా జనం భక్తులు పారవశ్యంతో చెంపలు వేసుకుంటూ టక్కర్ బాబాను చూస్తున్నారు. కొందరు పాదాలపై పడుతున్నారు. కాషాయ వస్త్రాలతో మెడలో రుద్రాక్షలతో, కర్ర చెప్పులతో బాబా ఏవో మంత్రాలు చెబుతూ భక్తులకు విభూది యిస్తున్నాడు. అది కళ్ళకు అద్దుకొని, నొసటన బొట్టుగా పెట్టుకుంటున్నారు. అంతమంది భక్తులకు హఠాత్తుగా బాబా విభూది ఎలా యివ్వగలిగాడు? చేతులు అటూఇటూ తిప్పి, తరువాత భక్తులకు విభూది యిచ్చిన బాబా మహత్తును కొనియాడుతున్నారు.

ఒక సందేహవాదికి అనుమానం కలిగింది. ప్రేమానంద్ అనే మాంత్రిక హేతువాదిని