పుట:Abaddhala veta revised.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్వరోగ నివారిణి ఆయిల్ పుల్లింగ్:

ఇటీవల చదువుకున్న వారినీ, సామాన్య అమాయకుల్నీ ఆవరించిన వైద్యం ఆయిల్ పుల్లింగ్. నూనె నోట్లో పోసుకొని కొంచెంసేపు పుక్కిలించి తరువాత వూసేయడం యిందులో ప్రధానం. మస్టర్డ్, సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. ఆయిల్ రంగు మొదట్లో ఎలా వున్నా నోట్లో పోసుకుని కాసేపు పుక్కిలించేసరికి, నోట్లో లాలాజలంతో కలసిపోతుంది. అలా కలవడం వలన నూనె రంగు మారుతుంది. రంగు మారటాన్ని చికిత్సగా భావిస్తున్నారు. అంతేగాక అన్ని రోగాలకు యిది మందు అని ప్రచారం చేస్తున్నారు. ఇలా నూనె పుక్కిలిస్తున్న వారు కొందరు తమకు ఏదో రిలీఫ్ యిచ్చినట్లున్నదని భావిస్తున్నారు. శరీరంలో సహజంగా వున్న రోగనిరోధకశక్తి వలన తగ్గిపోయే లక్షణాలుంటాయని వీరు గమనించడం లేదు.

తాంత్రికులు, మాంత్రికులు లోగడ కామెర్ల(జాన్ డిస్) రోగులకు ఆయిల్ యిచ్చి బాగా పుక్కిలించమనేవారు. కాసేపటికి వూసేస్తే అది లాలాజలంతో కలిసినందున పసుపుపచ్చగా మారేది. అది చూపించి, జబ్బు తగ్గిందని, పథ్యం చెప్పేవారు. కాలేయం, లివర్ కు విశ్రాంతి యిస్తే తగ్గే రోగాలకు అలా చెప్పి జనాన్ని భ్రమింపజేయడం చిరకాలంగా వస్తున్నదే.

ఒకవేళ లివర్(కాలేయం),కిడ్నీ జబ్బులు, ముఖ్యంగా కామెర్లు, తగ్గకపోతే, తాంత్రికులు, మాంత్రికులు బాధ్యత వహించరు. అప్పుడు రోగి కర్మగా చెబుతారు.

సమాధిలో యోగులు:

కారేశ్వరి బాబా సజీవ సమాధి అవుతారని ఢిల్లీలో వార్త ప్రాకింది. ఇంకేముంది? భక్తులు ఆఫీసులకు సెలవు పెట్టి వచ్చేశారు. బాబా గుడ్డి,చెవిటి,మూగవాడు. ఆ విషయం తెలిసి ఆయనపై యింకా ఆసక్తి పెరిగింది.

10 అడుగుల లోతు 2.5 అడుగుల చతురస్రపు సమాధి తయారుచేశారు. సిమెంటు చేసిన సమాధిలో కారేశ్వరి బాబా ప్రవేశించారు. అది 1980 అక్టోబరు మాసం.

సమాధిలో ప్రవేశించడం కళ్ళారా చూచిన భక్తులు, చుట్టూచేరి భజనలు చేశారు. 24 గంటల అనంతరం సమాధి తెరిచి చూచారు.

ఆశ్చర్యపోవాల్సిన భక్తులు నోరు నొక్కుకున్నారు. కారేశ్వరి బాబాను పురుగులు తింటున్నాయి. ఆయన చనిపోయాడు.

ఏం జరిగింది? మహత్తు ఏమైంది?

హేతువాది ప్రేమానంద్ భక్తులకు వివరించారు. సిమెంట్ చేయని సమాధి అయితే నేలలోని రంధ్రాల ద్వారా ప్రాణవాయువు వస్తుంటుంది. అందువలన 24 గంటలు వుండగలరు. సిమెంట్ చేసిన కారేశ్వరి బాబా నిమిత్తం ప్రత్యేకంగా ఆక్సిజన్ వచ్చేట్లు ఏర్పాటు