పుట:Abaddhala veta revised.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చీదరించుకోగా పారిపోవాల్సి వచ్చింది. అలాగే చంద్రస్వామి, ధీరేంద్ర బ్రహ్మచారి వగైరాల గొడవలు బయటపడ్డాయి. రామకృష్ణమఠం, షిర్డిసాయిమఠం, అయప్పకేంద్రం, తిరుపతి దేవస్థానం అవినీతి పనులు ఎన్నోసార్లు బయటపడుతూ వచ్చాయి. తిరుపతిలో గుండు చేయించుకుంటే తిరిగి జుట్టురాదంటే చాలామంది చేయించుకోరని ఒకరు చమత్కరించారు. ఏమైనా మతవ్యాపారానికి చిన్న పిల్లల్ని సైతం చిత్రహింసల పాలు చేస్తున్నారు.

ఇదీనేడు జరుగుతున్న తంతు! చిన్నతనం నుండి తల్లిదండ్రులు, పంతుళ్ళు, పురోహితులు మతమూఢనమ్మకాల్ని నూరిపోయడం వలన, శాస్త్రజ్ఞులుగా తయారైనవారు సైతం చిన్నతనం ప్రభావం నుండి ఒక పట్టాన బయట పడలేకపోతున్నారు.

నేడు ప్రభుత్వం బాహాటంగా బాబాలను, సన్యాసులను, యోగులను ప్రోత్సహిస్తున్నది.

సమాజంను నిర్వీర్యం చేస్తున్నది యీ బాబాలే. ఆలోచన చంపేయాలని యోగ పద్దతులను చిత్రవిచిత్రాలుగా ప్రచారం చేస్తున్నది యీ మతాలవారే. సన్యాసులు ఎంత ఎక్కువైతే సమాజం అంతటా క్షీణిస్తుంది. మూఢనమ్మకాలకు నిలయం యీ సన్యాసి ఆశ్రమాలు.

ప్రభుత్వం తక్షణమే యీ ఆశ్రమ వివరాలన్నీ సంపూర్ణంగా సేకరించాలి. ఆశ్రమాలకు ఆస్తి పన్ను, ఆదాయం పన్ను మినహాయింపులు యివ్వరాదు. నేరాల నుండి ఆశ్రమాలకు భద్రత కల్పించరాదు. మతాన్ని ప్రభుత్వాన్ని వేరుచేయాలి. భక్తివుంటే అది ప్రైవేట్ విషయంగానే తప్ప ప్రదర్శనకు పెట్టరాదు. ఇప్పటికే ఆశ్రమాలు, బాబాలు చాల సంఘద్రోహం చేశాయి. ఇప్పటికైనా అడ్డుకట్ట వేయకపోతే మనం ముందుకు పోలేం.

- హేతువాది, జూన్ 2001
చావుబ్రతుకుల్లో సెక్యులరిజం

ఇండియాలో సెక్యులరిజం కనుచూపు మేరల్లోలేదు. కేంద్రంలో గానీ, రాష్ట్రాలలో గానీ ప్రభుత్వాలు వస్తూ పోతూ వున్నవి. వీటన్నిటికీ సెక్యులరిజం పట్ల ఏకాభిప్రాయం వున్నది. అటువంటి అవగాహన వున్న రాజకీయపార్టీలు పెత్తనం చేసినంతకాలం సెక్యులరిజానికి అర్థం మారక తప్పదు. ఓట్లు రాబట్టాలనే దురుద్దేశ్యంతో రాజీపడే యీ రాజకీయపార్టీలు సెక్యులరిజానికి నిర్వచనం చెప్పాయి. దీనికి ఇండియాలో రాధాకృష్ణన్ పితామహుడు.

సెక్యులరిజం అంటే అన్ని మతాలను సమానంగా పరిగణించడం అని రాధాకృష్ణన్ చెప్పిన భాష్యానికి రాజకీయపార్టీలు అంటిపెట్టుకున్నాయి. అవసరమైతే తమకు అనుకూలమైన మతాన్ని ప్రవారం చేసుకుంటూ, మధ్య మధ్య మిగిలిన మతాలను పొగుడుతూ ఒక సందేశం పారేస్తుంటారు.