పుట:Abaddhala veta revised.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శాస్త్రీయ పద్ధతి వినియోగం - దుర్వినియోగం

ఇండియాలో శబ్ద ప్రమాణానికి విలువ ఎక్కువ. వేదాలు శబ్ద ప్రమాణాలే. వాటిని 'అపౌరుషేయాలు'అన్నారు. (ఎక్కాల పుస్తకం కూడా అపౌరుషేయమే) ఈ శబ్ద ప్రమాణాన్ని రుజువుకు పెట్టరు. అదంతా నిజమేనని నమ్ముతారుగూడా. బలీయమైన ఈ సంప్రదాయం బాగా నాటుకపోయినందువలన మనకు శాస్త్రీయ పద్ధతి బాగా అలవాటు కాలేదు.

అచ్చులో ఉన్నదంతా నిజమని నమ్మే మరో సంప్రదాయం గూడా ఉన్నది. చదువుకున్నవారు మనదేశంలో 30 % కాగా,అందులో వచ్చీరాని భాషాజ్ఞానం కలవారే ఎక్కువగా ఉన్నారు. పత్రికలలో వచ్చే అశాస్త్రీయ విషయాలు, అభూత కల్పనలు, వారఫలాలు, సన్యాసుల బోధనలు నమ్మేవారున్నారు.

అధికార ప్రమాణం కూడా మరొక ప్రమాదకారిగా పరిణమించింది. పండితులూ, కళాకారులూ, శాస్త్రజ్ఞులు వారి పరిధిలో నిపుణులు కావచ్చు. కాని, ఒక రంగంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఏం మాట్లాడినా అతని, పరిధికాని విషయాలను చెప్పినా, ప్రమాణంగా తీసుకోటం కనిపిస్తున్నది. సూరిభగవంతం ఫిజిక్స్ లోని ఒక విభాగమైన స్ఫటికాలపై పరిశోధన చేసి ప్రమాణాలను సాధించాడనుకొందాం. ఆయన తనకు వచ్చిన కీర్తినీ, పేరును వినియోగించుకొని సత్యసాయిబాబా భక్తుడుగా ప్రచారం చేసాడు. నమ్మేవారు అయన్ను భక్తుడుగాక, శాస్త్రజ్ఞుడుగా గౌరవించి, అంతటి శాస్త్రజ్ఞుడే చెపుతున్నప్పుడు మనవంటి వారిదేమున్నది? అని సాష్టాంగపడతారు. ఇలా వ్యక్తుల మాటల్ని సందర్భసహితం కాకపోయినా ప్రమాణంగా స్వీకరిస్తున్న ప్రమాదం భిన్నరంగాలలో ప్రబలి ఉన్నది. శాస్త్రీయ పద్ధతిని అన్వయించక పోవటం వలన ఈ చిక్కు వచ్చింది. సైన్సులో గూడా ఇలాంటి దోషాలు లేకపోలేదు. ఉదాహరణకు, ఎలక్ట్రాన్, ఖగోళశాస్త్రం, అలోపతి, ప్రజాస్వామ్యం అనేవి ఆయా రంగాలలో శాస్త్రీయ పద్ధతికి నిలబడే అంశాలు. ఇందుకు భిన్నంగా జ్యోతిష్యం, ఆయుర్వేదం, హోమియోపతి, దేవుడు, మార్క్సిజం అనేవి అశాస్త్రీయాలు. అనగా రుజువుకు నిలబడవు. నమ్మకం వీటికి ప్రధానం ఇదే విధంగా సైన్సు పరిధిలో అనేక అశాస్త్రీయ విషయాలు కొందరు ఆకర్షణీయంగా ప్రచారం చెస్తున్నారు. అతీంద్రియ శక్తులు, మరణించిన వారితో మాట్లాడటం, పునర్జన్మ, సంఖ్యకు బలం ఉంటుందనీ, కంటిచూపుతో దూరాన ఉన్న వస్తువును కదిలించవచ్చునని, మొదలైనవి ఎన్నో శాస్త్రం పేరిట ప్రచారంలోకి వచ్చాయి. వీటిలో ఏదీ క్లిష్టమైన పరీక్షకు నిలబడదు. మిడిమిడి జ్ఞానంతో అన్వయించే శాస్త్రీయ పద్ధతి వలన రుజువులు లభించినట్లు కనిపించినప్పటికీ, సరైన పద్ధతిలో ఇవి రుజువు చేయజాలనివే.

శాస్త్రజ్ఞులు సహితం పరిశీలన, వివేచన ఆధారంగా ఒక్కొకసారు కొన్ని నమ్మకాలను ఏర్పరచుకొంటారు. కుళ్ళిపోతున్న మాంసం నుండి క్రిమికీటకాలూ,ఈగలు తదితర సూక్ష్మజీవులు