పుట:Abaddhala veta revised.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు సరదాగా ఏటా కొందరికి బిరుదులు తన పత్రిక ద్వారా ప్రకటిస్తుండేవాడు. అలా ఒక ఏడు ప్రకాశానికి "ఆంధ్రకేసరి" అని ఇచ్చారు. ఈ సంగతి తెలిసినవారు తక్కువ.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రావతరణ సమస్య 1913లో మొదలై, చాలామంది త్యాగాలను కోరింది. కాని తీరా రాష్ట్రం రాబోయే సమయానికి ప్రకాశం, పట్టాభిల ముఠాతగాదాల వలన యీ సమస్య కొంత సాగదీయవలసి వచ్చింది. జవహర్ లాల్, వల్లభాయ్, పట్టాభిల నివేదికను అంగీకరిస్తే 1950 నాటికే ఆంధ్రరాష్త్రం ఏర్పడి వుండేది. కాని ఆ కీర్తి పట్టాభికి దక్కుతుందని ప్రకాశం అడ్డుపడి మద్రాసు మాకే కావాలన్నాడు. తెన్నేటి విశ్వనాధం ఏమి రాశారో గమనించండి. "చివరకు, 1952లో సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలలోని ఆంధ్రసభ్యులు చెన్నపట్నం మీద ఆశవదులుకోవడం వల్ల, ఆంధ్ర కాంగ్రెసుపార్టీ వారు చెన్నపట్నం తమిళ రాష్ట్రంతో కలిపివేయాలన్ని నివేదికలో సంతకం చేయడం వల్ల - ప్రకాశంగారు, ఆయన అనుయాయులు కూడా చెన్నపట్నం లేకుండా ఉన్న ఆంధ్రరాష్ట్రం ఏర్పడడానికి అంగీకరించవలసి వచ్చింది" (నా జీవితయాత్ర - అనుబంధ సంపుటి చతుర్ధఖండము పేజి 772 ఎమెస్కో ప్రచురణ) అంతవరకూ బాగానే వుంది. తరువాత పొట్టి శ్రీరాములు 52 అక్టోబరు 19న ఆమరణనిరాహారదీక్ష పూని, మద్రాసుతో కూడిన ఆంధ్ర కావాలంటే, ప్రకాశం అందుకు మద్ధతు ప్రకటించాడు. అప్పుడు జరిగిన హింసలో ఆస్తుల మాటెలావున్నా, ప్రాణనష్టం ఎంతో జరిగింది. నాయకుల చెలగాటంలో ప్రజలు చితికిపోవడం పరిపాటే. అందుకు ప్రకాశం మినహాయింపుకాదు. జీవితాంతమూ మద్రాసు నగరం కోసం ప్రకాశం పట్టుబట్టి పోరాడివుంటే, ఆయన పట్టుదల గలవాడని మెచ్చవచ్చు. కాని పదవి ఎరచూపేసరికి అన్నీ మరచిపోతూ వచ్చాడు.

ప్రకాశం చేసిన త్యాగాలను, సేవలను, దోషాలను అంచనావేసి చూస్తే, మొత్తం మీద తప్పటడుగులే ఎక్కువ. వ్యక్తిగతంగా ఆయన నుండి మనం నేర్చుకునేవి ఏమీలేవు. జమిందారీ వ్యతిరేక పోరాటం, గాంధీ వంటి నాయకులతో ఢీకొనడం వంటి విశేషాలే చెప్పుకోదగినవి.

- ఈనాడు, ఆగస్టు 1982
తెలుగునేలను సస్యశ్యామల సీమగా
మార్చడానికి బ్రిటిష్ వారితో పోరాడిన ఆర్ధర్ కాటన్

గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ త్రాగటానికి నీళ్ళులేవు. ఒక ఏడు అతివృష్టి, మరొక ఏడు అనావృష్టి. ఏటా గోదావరి వరదలు చేసే బీభత్సం. 1854 వరకూ గోదావరి ప్రజలు పడ్డ యిక్కట్లు యిన్నీ అన్నీ కాదు. నేడు ఉభయగోదావరి ప్రజలు పచ్చ పచ్చగా ఉండటానికీ, తెల్లబట్టలు