పుట:Abaddhala veta revised.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విలేఖరులు, కళాకారులు, కవులు, స్వాములు,పురపాలకులు, రాజకీయపు మనుషులు, హ్యూమనిస్టులు, అన్యులు వుండేవారు.

పదవులు లేనివారికి, 'నష్టజాతకులకు', సన్మానాలు చేయించాడు. స్వేచ్ఛ దెబ్బతినే ఏ విధాన్నైనా ధైర్యంగా ఎదిరించాడు. 'మూడక్షరాల', 'ఐదవ తరగతి' పండితుల మొదలు, 'బ్రహ్మీమయమూర్తుల' వరకూ అన్ని రంగాలలో భిన్నస్థాయీ భేదాలతో, ఆదరించటమో ఎదిరించటమో చేయగలిగాడు. ఎంతటి ఆప్తులైనా తప్పుదారిన పడితే, 'తప్పు' అని హెచ్చరించగలిగాడు. పదుగురాడు మాటే చెల్లాలి అంటే, అది హేతుబద్ధం కాకుంటే, అలాగని చెప్పి, ప్రవాహానికి అడ్డంగా, ఎదురుగా ఈదాడు. ఆయన ఠాగూర్ విమర్శిస్తూ వ్యాసం వ్రాస్తే, 'రాడికల్ హ్యూమనిస్ట్' (ఆంగ్ల వారపత్రిక) ప్రచురించలేకపోయింది. రాడికల్ హ్యూమనిజం కూడా అనార్కిజానికి దారి తీస్తుందంటే ఆశ్చర్యపోయారు అనుచరులు. కాశ్మీర్ సమస్యపై వ్యాసాలు వ్రాస్తుంటే, అరెస్ట్ చెస్తారేమోనని మిత్రులు భయపడకపోలేదు. సంస్కృతానికి తెలుగే మాతృక అంటే ఆశ్చర్యంతో నోర్లు నొక్కుకున్నారు.

అసలు ఆవుల గోపాలకృష్ణమూర్తిలో లోపాలే లేవా? అన్నీ అత్యుత్తమ లక్షణాలేనా? అంంటే అదేమికాదు. కాని లోపాల నుండి నేర్చుకునేదేమున్నది, లోపాలు తప్ప!

తారీఖులతో నిమిత్తంలేని జీవితం గడపి, ఒకరు అనుసరించ వీల్లేని పంథాలలో గమించి, విశేషణాలలో యిమడని రీతిగా ఎన్నో పనులు చేసాడు.

వ్యాసాలు-ఉపన్యాసాలు, పౌరోహిత్యం, ప్రెస్ క్లబ్, బాలకళామందిర్, లయన్స్ క్లబ్, పంతుళ్ళ సమావేశాలు; సన్మానాలు కవులకు, కళాకారులకు; స్టడీకాంపులు, రాడికల్ హ్యూమనిస్ట్ లకు; అన్నిటా 'గాత్రం' పాడి, 'వైశేషికత్వాన్ని' నిలబెట్టుకున్నాడు. అనేక యుద్దముల ఆరితేరిన జ్ఞానవృద్ధుడయ్యాడు. అఖిల భారత సమావేశాల్లో, అమెరికా, ఐరోపాలలో విశిష్టుడుగానే చలామణి అయ్యాడు. ఇంట్లో పిల్లలమధ్య హాయిగా కాలక్షేపం చేసాడు. వాళ్లు పూజలు, పునస్కారాలు చేస్తుంటే - మతస్వేచ్ఛ అర్థం చేసుకుని ఆచరణలో పెట్టిన వ్యక్తిగనుక - నిరోధించనూలేదు, ప్రోత్సహించనూ లేదు. తన భావాలు చెప్పేవాడు. వాటి ప్రభావం తక్షణమే చూడాలన్నంత రాజకీయవాది కాదు.

ఆంధ్రలో పునర్వికాసోద్యమం వ్రాస్తూ, అందులో ఆయన పాత్ర వ్రాస్తే, కొంత స్వీయం కలసొస్తుందని, చనువుతో నేనంటే 'పార్కలాం' అన్నాడేగాని, దానికి నాంది పలకలేదు. అన్యులు ఆ కృషి చేసేదెప్పుడోమరి!

- హ్యూమనిజం,అక్టోబరు 1966