పుట:Abaddhala veta revised.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాలిన్ పేరడిస్ అనే బాలిక 1763 డిసెంబరు 9 ఉదయం హఠాత్తుగా తన చూపు పోయిందని తెలుసుకున్నది. ఆ బాలిక వయస్సు 4 ఏళ్ళు. కంటి నరం పక్షవాతంతో వున్నందున యిది నయం కాదని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రుల సంప్రదాయంగా ఆ బాలికకు పియానో వాయించడం అలవాటైంది. రాణి కొలువులో ఆమె తల్లిదండ్రులు పనిచేసేవారు. ఆ బాలిక ప్రతిభ రాణిని ఆకర్షించింది. 10 ఏళ్ళపాటు వియన్నాలో అత్యుత్తమ కంటివైద్యుడు చికిత్స చేసినా చూపు రాలేదు. ఈలోగా పియానోపై తన ప్రతిభను చూపుతున్న పేరడిస్ (మరియాతెరిసా అని కూడా పిలిచేవారు)లండన్, ప్యారిస్ మొదలైన చోట్ల కచేరీలు చేసి, గుడ్డి అమ్మాయి అద్భుతంగా పియానో వాయించడం పట్ల అందర్నీ ఆకట్టుకున్నది. కంటివైద్యుడు ఏంటన్ వాన్ స్టార్క్ 14 ఏళ్ళ ప్రాయంగల ఆ అమ్మాయి కంటి నరం చెడలేదని నిర్ణయించాడు. కాని అతడి చికిత్స పనిచేయలేదు. గుడ్డితనాన్ని నటనగా ఆమె వాడుకుంటుందన్నమాట. అది గిట్టుబాటు గుడ్డితనం.

అలాంటి దశలో మెస్మర్ తటస్తపడ్డాడు. శారీరకంగా కంటిజబ్బు వుంటే నయం కాదని, లేకుంటే చికిత్స చేయవచ్చనీ చెప్పాడు. 1776లో మెస్మర్ ఆమెకు చికిత్స ప్రారంభించాడు. 1777 నుండీ ఆమె మెస్మర్ చికిత్సాలయంలో వుండగా, కొద్దివారాలలోనే చూపు కొంతమేరకు వచ్చింది. తల్లిదండ్రులు సంతోషించారు. మొదటిసారి చూపు వచ్చినప్పుడు ఎదుట వున్న మెస్మర్ ను చూచి, ఎంత భయంకర దృశ్యం అని ఆమె వ్యాఖ్యానించింది. చూపు వచ్చిన తరువాత ఆమె మానసికంగా కృంగిపోయింది. బంధుమిత్రులను చూచినప్పుడు మూర్ఛ పోతుండేది. ఆమె హిస్టీరియా జబ్బుతో వుందని బయటపడింది. కావాలని గుడ్డితనం నటించిన ఫలితమిది.

వియన్నాలో జోసెఫ్ బార్త్ ఆధ్వర్యాన వైద్యబృందం పరిశీలించి మెస్మర్ ను తీవ్రంగా విమర్శించింది. ముందున్న వస్తువుల్ని మరియాతెరిసా పేరడీస్ యింకా గుర్తించలేకపోతున్నదని వారు వెల్లడించారు. అంతటితో మెస్మర్ ఉక్కిరిబిక్కిరి అయ్యాదు. ఆ అమ్మాయికి చూపు వచ్చివుంటే (మెస్మర్ చెబుతున్నట్లు) రాణి యిచ్చే డబ్బు ఆమె తల్లిదండ్రులకు యిక యివ్వనవసరం లేదన్నారు వైద్యులు. పియానో వాయించే కచేరీలలో ఆమె పట్ల ఆకర్షణ సగం పోవడం ఖాయమన్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెను తమకు అప్పగించమని మెస్మర్ ను కోరారు. మెస్మర్ కుంగిపోయాడు తన ప్రతిష్ఠ దెబ్బ తిన్నందుకు!

మెస్మర్ - రోగిగా వున్న మరియాతెరీసా ప్రేమికులుగా వున్నట్లు సమాజంలో ప్రాకిపోయింది. వియన్నాలో యీ విషయం దుమారం వలె అల్లుకపోయింది. ఈ ఫార్సుకు అంతం పలుకమని రాణి మెస్మర్ ను ఆదేశించింది. 1777 మే 2న మెస్మర్ ఆ ప్రేమికురాలిని తల్లిదండ్రులకు అప్పగించాడు. ఆమె వయస్సు 18 ఏళ్ళు.

తల్లిదండ్రుల వద్దకు చేరిన మరియా తెరీసాకు మళ్ళీ చూపులేదు. గుడ్డితనాన్ని ఆమె ఆనందించింది. అలాగే పియానో కచేరీలు చేసి కీర్తి ఆర్జించింది. మొజార్ట్ కూడా ఆమె కోసం