పుట:Abaddhala veta revised.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత రాజ్యాంగం ప్రకారం మతపరంగా ఎలాంటి పన్నులను వసూలు చేయరాదు. కాని ప్రభుత్వపరంగా మత సంస్థలకు లభిస్తున్న సహాయం పరోక్షంగా పౌరులిచ్చే పన్నుల నుండే వస్తున్నది. సెక్యులర్ ధోరణులు దెబ్బతీయడానికి ప్రభుత్వ మతధోరణి బాగా తోడ్పడింది. రాధాకృష్ణన్, గాంధి ధోరణులు సెక్యులరిజాన్ని బాగా దెబ్బతీశాయి. నెహ్రూ రాజీపడ్డారు.

క్రైస్తవ మతస్తులు 1953లో నాగపూర్ లో సమావేశమై మతపరమైన విషయాలన్నీ వ్యక్తుల స్వేచ్ఛకు వదలివేయాలన్నారు. క్రైస్తవ మతంలోకి పేదవారిని మార్చే పద్ధతులు మత మిషనరీలు సాగిస్తూ పోయారు. ఇలా మతపార్పిడి చేస్తే హిందూ మతాచారాలు, ఆచార వ్యవహారాలు,భాష, వేషం, అన్నీ మారిపోతాయని గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. (హరిజన్ 1935 మే 11 క్రైస్తవ మిషనరీలు,దెయిర్ ప్లేస్ ఇన్ ఇండియా, 1941 నవజీవన్ ప్రెస్) మతమార్పిడి చట్టరీత్యా ఆపాలని కూడా గాంధి అన్నారు. (హరిజన్ 1935 మే 11) క్రైస్తవ బిషప్పులు యీ విషయమై హిందువుల ధోరణిని నిరసిస్తూ వచ్చారు. క్రైస్తవులుగా మారిన వారిని శుద్ధిచేసి తిరిగి హిందువులుగా మార్చడాన్ని కూడా గాంధి ఖండించారు.

మొత్తం మీద క్రైస్తవులు మతమార్పిడి ద్వారా తరచు మతకలహాలకు దారి చూపారు.

క్రైస్తవుల విమర్శల వలన భారతదేశంలో, ముఖ్యంగా 19వ శతాబ్దంలో బ్రహ్మసమాజ్ బాగా ప్రభావితమైంది. రామమోహన్ రాయ్, కేశవ చంద్రసేన్ యిందుకు నిదర్శన. ఆర్యసమాజ్ క్రైస్తవ వ్యతిరేకత చూపించింది.

తర్జన భర్జనలు సాగాయి. పరిమితంగా చదువుల్లో క్రైస్తవ మత ప్రచార ప్రభావం కనిపించింది. పేదరికం క్రైస్తవమతవ్యాప్తికి బాగా తోడ్పడింది. వైద్యం, విద్య, ఆహారం అస్త్రాలుగా ప్రయోగించి, క్రైస్తవ మిషనరీలు మారుమూలల్లో పేదల్ని ఆకట్టుకున్నారు. హరిజనుల్లో మతపార్పిడి చాలా చోట్ల చేయగలిగారు. బలవంతమైన మైనారిటీ శక్తిగా క్రైస్తవులు దేశంలో తలెత్తారు. మతమార్పిడి విషయమై క్రైస్తవులు రాజీపడలేదు. అది తమ హక్కుగా వారు భావిస్తున్నారు. క్రైస్తవ మతం విదేశీయం కాదనేటంత వరకూ పోయారు.

జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా క్రైస్తవమతం భారతదేశంలో ప్రాచీనమైనదని, ఇంగ్లండ్ కు పోక ముందే భారతదేశానికి సిరియన్ క్రైస్తవులు వచ్చారన్నారు. (1955 డిసెంబరు 3 నెహ్రూ లోక్ సభ ప్రసంగం)

విద్యాసంస్థలలో మతబోధన చేస్తున్న క్రైస్తవుల ధోరణి పట్ల హిందువులలో నిరసన వ్యక్తమైంది. మతం అని సూటిగా అనకుండా నీతి పేరిట బైబిల్ లోని విషయాలు బోధించడం క్రైస్తవుల ఎత్తుగడ అయింది. మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ విషయమై ఎన్ని అవరోధాలు, చట్టపరిమితులు వున్నా, క్రైస్తవులు రాజీపడలేదు. బలవంతంగా మతమార్పిడి జరగరాదని రాజ్యాంగం చెబుతున్నా, ఆచరణలో యిది తేల్చడం కష్టమై పోయింది. రాజ్యాంగ నిర్మాతలలో