పుట:Abaddhala veta revised.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1906 డిసెంబరు 30న ముస్లింలిగ్ ఏర్పడింది. అదే వేర్పాటుకు నాంది అయింది. అన్ని సంస్థలలోనూ ముస్లింలకు కేటాయింపులు, వేరే ప్రాధాన్యతలు కోరడం ప్రారంభమైంది. కాంగ్రెస్ ను వ్యతిరేకించడం కూడా మొదలైంది. ముస్లింలు జాతీయ జీవనస్రవంతిలో పాల్గొనకుండా వేరుచేయడంలో వారిని అన్ని విధాల బ్రిటిష్ వారు ప్రోత్సహించారు. చీలించి పాలించే విధానం చక్కగా ప్రయోగించారు. అదే నేటికీ అంటుజాఢ్యం వలె పట్టుక వెన్నాడుతున్నది.

జాతీయోద్యమంలో వున్న కాంగ్రెస్ నాయకులు ఎలాగైనా ముస్లింలను కలుపుకపోవాలని చూచారు. పండిత మదన్ మోహన్ మాలవీయా వంటి వారు ముస్లింలకు ప్రత్యేక సౌకర్యాలు, మినహాయింపులు (Weightages) వ్యతిరేకించారు. హిందువుల ఐక్యత పేరిట గణపతి ఉత్సవాలు తిరగదోడిన తిలక్ మాత్రం, బ్రిటిష్ వారిని వ్యతిరేకించే నిమిత్తం, అవసరమైతే ముస్లింలకు కేటాయింపులు సైతం యివ్వాలని వాదించారు. లక్నో కాంగ్రెసు సభలలో తిలక్ యిలాంటి ధోరణి అనుసరించి, జాతీయ జీవన స్రవంతిలో ముస్లింలను కలుపుక పోవాలనే ఆశించాడు.

ఈలోగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు సంభవించాయి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం, ముస్లింల ఆటోమన్ సామ్రాజ్యం కూలిపోతుండగా, ముస్లింలు కలవరపడ్డారు. ఖిలాఫత్ ఉద్యమం ఆరంభమైంది. అప్పుడే జాతీయోద్యమంలో ప్రవేశించిన గాంధి ఖిలాఫత్ ఉద్యమాన్ని వెనకేసుకొచ్చారు. టర్కీలో ముస్తాఫా కెమాన్ పాషా అనేక సంస్కరణలు తలపెట్టి, ఖలీఫా వ్యవస్థను అంతమొందించేశారు. మనదేశంలో ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్న ముస్లింలు కాంగ్రెసుకు దూరమయ్యారు. జాతీయోద్యమానికి వ్యతిరేకులయ్యారు. మిగిలిన కొద్దిమంది కాంగ్రెస్ లో కొనసాగుతూ ముస్లింలను తమవెంట తీసుకరాలేకపోయారు. అబ్ధుల్ కలాం ఆజాద్ వంటి వారిని జాతీయ ముస్లింలని నిందించారుకూడా. ఆ విధంగా హిందూ-ముస్లిం ఐక్యత కోసం గాంధీ చేసిన కృషి విఫలమైంది. మత ప్రాతిపదికలతో జాతీయోద్యమం నడపడంలో వున్న ప్రమాదం అదే. పునర్వికాసానికి కూడా యీ ధోరణులే అడ్డొచాయి. లక్నో ఒడంబడిక ప్రకారం ముస్లింలు తమ మతాన్ని యిష్టం వచ్చినట్లు ప్రచారం చేసుకోవచ్చు, ఆచరించవచ్చు. అయినా వారు తృప్తిపడలేదు. తమ ఉర్ధూభాషకు వేరే గుర్తింపు ఉండాలన్నారు. ఎన్నికలలో కేటాయింపులు కోరారు.

మతపరంగా ఎవరినీ విచక్షణతో చూడరాదని నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ప్రకటించిన ముసాయిదా తీర్మానాలలో యీ విషయం స్పష్టం చేశారు. ఇదికూడా ముస్లింలకు తృప్తినివ్వలేదు.

భారత రాజ్యాంగ చట్టానికి 1935లో వచ్చిన సవరణల దృష్ట్యా రాష్ట్రాలకు స్వయంపాలనా ప్రతిపత్తి లభించింది. 1937లో జరిగిన ఎన్నికలలో వివిధ పార్టీలు పోటీచేశాయి. కాంగ్రెసు ఆరు