పుట:Abaddhala veta revised.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేస్తూ యజ్ఞయాగాదులు జరుపుతూ వున్నా రోజులలో బౌద్ధం పుట్టింది. అహింసావాదం ప్రచారం చేసింది. సంఘంలో వున్నా హెచ్చుతగ్గులు పోవాలన్నది, స్త్రీపురుషులు సమానం అనీ, మానవులంతా ఒకటేనని అన్నది.

ప్రజలు బౌద్ధాన్ని ఆరాధించారు. ఆదరించారు. అనుసరించారు. అప్పుడేం జరిగింది? హిందూమతం పునరుద్ధరణ పేరిట, రాజుల సహాయంతో శంకరాచార్యులు మొదలైనవారు బౌద్ధాన్ని చంపేశారు. బౌద్ధభిక్షువులను నాశనం చేసారు. బౌద్ధ ఆరామాలను కొన్నిచోట్ల దేవాలయాలుగా మార్చారు. అయినా, బౌద్ధం పూర్తిగా నాశనం కాకపోయేసరికి, బుద్దుడిని పొగడడం ప్రారంభించారు. నేడు అంబేద్కర్ ను పొగిడినట్లే నాడు బుద్ధుడిని ఆకాశానికి కెత్తారు. తెలివిగా. బుద్ధుడు కూడా దశావతారాల్లో ఒక్కడన్నారు. దేవుడు అనే భావనను దూరంపెట్టిన బుద్దుడినే దేవుడిగా మార్చి కొలిచారు. కాని బుద్ధుడి భావాలు అమలుపరచలేదు. సమానత్వం అనే మూలభావాన్ని ఆచరించలేదు. కాని బౌద్ధాన్ని పారద్రోలగాలిగారు.

మనదేశంలో బౌద్ధం నాశనంగావడం పునర్వికాసానికి,హేతువాదానికీ, మానవ వాదానికి ప్రమాదంగా పరిణమించింది. కులాల హెచ్చుతగ్గులు మళ్ళీ విజృంభించాయి. బౌద్ధులకు, హిందువులకు జరిగిన పోరాటంలో అంటరానితనం పుట్టింది. సంస్కరణవాదులు ఎందరు పైపైన ప్రయత్నించినా, హిందూ సమాజంలోని దోషాల్ని తొలగించలేక పోయారు. ఈ దోషాలకు మూలాధారంగా "పవిత్ర" మతగ్రంథాలు,శాస్త్రాలు నిలిచాయి. వాటి జోలికి పోకుండా తలపెట్టిన సంస్కరణలు హిందూమతాన్ని అందలి దోషాల్ని తొలగించలేకపోయాయి. 20వ శతాబ్దంలో అంటరానితనాన్ని పాటించే హిందూ సమాజం ప్రపంచం దృష్టిలో తలవంపులకు గురైంది.

అలాంటి స్థితిలో అంబేద్కర్ వచ్చి కూలంకషంగా హిందూ సమాజంలోని దోషాల్ని పరిశీలించారు. వాటిపై పోరాడారు. ధ్వజమెత్తారు. ఆయన చెప్పినవి, చేసినవి సబబే అనిపించారు. అంటరాని కులాలవారు,శూద్రులు సమాజంలో గణనీయంగా వున్నారు. వారికి ఓట్లున్నాయి అని లేనిదే ఏ పార్టీ గెలవదు. కనుక రాజకీయపార్టీలు కొత్త ఎత్తుగడలతో, తాత్కాలికంగా ఓటర్లను మభ్యపెట్టే వ్యూహాలు అనుసరిస్తున్నాయి. అందులో భాగంగా నేడు అంబేద్కర్ ను తెగ పొగిడేస్తున్నారు. అది విని అటు షెడ్యూల్ కులాలు,అటు శూద్రకులాలు సంతోషపడి ఓట్లు వేయాలని రాజకీయ పార్టీల ఉద్దేశం.

అంబేద్కర్ సిద్ధాంతీకరించిన వాటిని ఆమోదించి ఆచరిస్తామంటే అభ్యంతరం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. అందుకే యీ వ్యాసం. అంబేద్కర్ రాసినవి,చెప్పినవి ఏ రాజకీయపార్టీ ఆమోదిస్తున్నది? ఎంతవరకు ఆచరించగలవు అనేదే యిప్పటి పరిశీలనాంశం. నిజంగా ఆమోదిస్తే సంతోషం. కాని పొగుడుతూ,గోతులు తవ్వి అంబేద్కర్ ను పూర్తిగా చంపేయాలనే ఎత్తుగడ అయితే, జాగ్రత్త పడాలి. ఆ విషయం శ్రద్ధగా, లోతుగా పరిశీలించాలి. అంబేద్కర్ పేరిట, కొందరు బయలుదేరి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ కమిటీలు వేయమనీ, విగ్రహాలు