పుట:Abaddhala veta revised.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్వేషణా కేంద్రంవారు ఇటీవల ఇంగర్ సాల్ మ్యూజియం ను కూడా ఏర్పరిచారు. క్రైస్తవమతాన్ని, బైబిల్ ను నిశిత విమర్శకు గురిచేసిన ఆర్.జి.ఇంగర్ సాల్ మ్యూజియం డ్రెస్డన్ లో ప్రారంభించారు. ఇది న్యూయార్క్ రాష్ట్రంలో రోచస్టర్ దగ్గర వుంది.

ప్రామిథియస్ ప్రచురణలు ఈ కేంద్రానికి జీవగర్ర. వివిధ రంగాలలో శాస్త్రీయ కృషిని వీరు ప్రచురణల ద్వారా వెలికితీస్తుంటారు. ప్రచురించడానికి ఇతరులు వెనుకాడినవాటిని, శాస్త్రీయమని ఆధారాలుంటే, ఈ సంస్థ అచ్చేస్తుంది. అందుకే ప్రామిథియస్ కు పేరు లభించింది.

ఏ భావాన్ని మతాన్ని అభిప్రాయాన్ని ముందుగా ఈ కేంద్రం తృణీకరించదు. శాస్త్రీయ పరిశీలనకు గురిచేయడం ఇందలి ప్రధానాంశం.

ఇకముందు అమెరికా సందర్శించేవారు సెంటర్ ఫర్ ఇంక్వయిరీని తప్పకుండా చూడలి. న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ పక్కనే బఫెలో నగరంలో ఇది వుంది. అక్కడకు వెళ్ళలేనివారు అనుబంధ కేంద్రాలతో సంబంధం పెట్టుకుని విషయాలు తెలుసుకోవచ్చు. అమెరికా వెళ్ళినవారు ఈ కేంద్రానికి ఉచితంగా ఫోను చేయవచ్చు. 1-800 - 634-1610 వీరి నెంబరు. వెళ్ళదలచుకున్నవారు ఆం రెస్ట్, న్యూయార్క్ 14226-0703కు వెళ్ళవచ్చు. ("వార్త" సౌజన్యంతో)

- హేతువాది, ఆగస్టు, సెప్టెంబరు 1997
మూఢనమ్మకాలు

ఆష్టగ్రహ కూటమి జరుగుతుంది గనుక అందరూ అరుణాచల ఆశ్రమానికి రండి. లేకుంటే హతమారిపోతారని సుప్రసిద్ధ రచయిత చలం మిత్రులకు ఉత్తరాలు రాశాడు. ఇంకేముంది? మూటాముల్లె కట్టుకొని కొందరు వెళ్ళిపోయారు. 1962 నాటి సంగతి. కాని ఏమీ జరగలేదు.

నీవు పదవిలో పూర్తికాలం కొనసాగుతానని ముఖ్యమంత్రిగా వున్న డా॥మర్రి చెన్నారెడ్డికి 1990 చివరిలో జ్యోతిష్యులు దీవించి చెప్పారు. నెల తిరగక ముందే ఆయన పదవి కోల్పోయారు.

1991 మార్చిలో ముఖమంత్రి పదవి కోల్పోతారని యిటీవల తిరుపతిలో సమావేశమైన జ్యోతిష్యులు ప్రకటించారు. భావ స్వాతంత్ర్యం ఉంది కనుక వారి స్వేచ్ఛను అలా వాడుకోనివ్వండి అని ముఖ్యమంత్రి జనార్థనరెడ్డిగారు అన్నారు.

ఈ విధంగా ఎందరికో ఎన్నో చెబుతూ జ్యోతిష్యులు నమ్మిస్తున్నారు. నిజం కాకుంటే కర్మ అనుకుని జనం సర్దుకు పోతున్నారు. ఈలోగా ఏదో జరుగుతుందనీ, శాంతి చేయించేవారు, ఖర్చున పడుతున్నవారు లేకపోలేదు.