పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొద్దిలో వుండేవి. వ్యాపారం కొద్దియెత్తున జరుగుతుండేది. చాలా సంస్థలు ఈనాడు మనకు అతి స్వల్పమైన మొత్తంగా కనిపించే మూలధనంతో ఆరంభమయినవే. ఈ పెట్టుబడిదారులు అప్పుడప్పుడూ డబ్బు అప్పుపుచ్చుకోవలసి వస్తుండేది. కానీ వారు ఆ అప్పులను సకాలంలో తీర్చగలుగుతుండేవారు. ఎగుడు దిగుడుపని యేమాత్రం వుండకూడదనీ, నిర్మించే ప్రతి బ్రిడ్జిని చేతనయినంత కట్టుదిట్టంగా నిర్మించాలని వారిలో అందరూ స్థిరనిశ్చయులయినారు. వీరు సక్రమంగా నిర్మించిన బ్రిడ్జీలను గురించి మాటాడుకొంటుండేటప్పుడు థామస్ కార్లైల్ నుంచి గ్రహించిన "ఆనెస్టుబ్రిడ్జ్" [నమ్మకమయిన వంతెన] అన్న పదబంధాన్ని తరుచుగా ప్రయోగిస్తుండేవాళ్లు.

పెన్సిల్వేనియానుంచి పశ్చిమంగా తమ రైలు మార్గాన్ని విస్తృతం చేస్తున్నప్పుడు వొకరైల్‌రోడ్ కంపనీ వీరిని "పిట్స్‌బర్గుకు పశ్చిమంగా వున్న స్ట్యూబెన్ విల్లి దగ్గిర ఓహైయోనదిమీద వొక వొడ్డునుంచి మరొక వొడ్డుకు మూడువందల అడుగుల మధ్య దూరంతో ఒక బ్రిడ్జిని తయారు చేసి యిచ్చె పనికి పూనుకొంటారా" అని అడిగింది. ఇది ఈ కీస్టొన్ సంస్థకు తొలిరోజుల్లో వచ్చిన "సవాలు" ల్లో ఒకటి. అప్పటికి ఉక్కు ఇంకా అమెరికాలో తయారు కావటం లేదు. అంత ఎక్కువ 'మధ్యస్థదూరం'తో పోత ఇనుమును ఉపయోగించి రైల్‌రోడ్డు బ్రిడ్జిని నిర్మించటమంటే ఎంతో గొప్ప సాహసిక చర్య. అయినా వారు ఆ పనిని