పుట:Aandhrakavula-charitramu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

ఆంధ్ర కవుల చరిత్రము

పరరాష్టాధిపతులచేత దగ్ధము చేయబడినట్టును, అందుచేతనే యీ దేశము నకు దగ్ధరాష్ట్రమనియు, వేగి దేశ మనియు నామములు కలిగినట్టును చెప్పఁ బడి యున్నది. ఆ మహాదహనసమయమునం దావఱకున్న పుస్తకము లన్నియు తగులఁబడిపోయి యుండవచ్చును. అట్లుగాక యావఱకేమియుఁబుస్తకములే లేక యుండిన పక్షమున నన్ని కట్టుదిట్టములతో నంత నిర్దుష్ట ముగా నూతనముగా గ్రంధరచన చేయుట నన్నయభట్టునకు గాని మరియవ్వరికి గాని సాధ్యమై యుండదు. అయినను మనవారు కొందఱు భారత మునకుఁ బూర్వము తెనుఁగు కవిత్వము లేదనియు, నన్నయభట్టే భారత రచనచేత నాంధ్రకవనమును బుట్టించెననియు, పట్టుదలతో వాదించుచున్నారు. భారతరచనారంభమునకు ముందే రాజరాజ నరేంద్రుఁడుభయ భాషాకావ్య రచనాభిశోభితుఁ" డని తన్నుఁగూర్చి భావించినట్లు నన్నయభట్టే చెప్పకొని యుండుటచేత నప్పటికే సంస్కృత కవిత్వమువలెనే తెనుఁగు కవిత్వముకూడ నున్నట్టు స్పష్టమగుచున్నది. ఇది గాక నన్నయ కాలమునందే గణితమును రచించిన పాపలూరి మల్లన్నయ, ఆంధ్రభారత రచనకుఁ తోడుపడిన నారాయణభట్టును, తెనుఁగుకవు లుండి యున్నారు. కుమారసంభవమును రచిం చిన నన్నెచోడుఁడు తన పుస్తకమునందుఁ బ్రధమాశ్వాసములో

  "క. మును మార్గకవిత లోకం
      బున వెలయఁగ దేశికవిత బుట్టించి తెనుం
      గు నిలిపి రంధ్ర విషయ*మున
      జనసత్యాశ్రయుని దొట్టి చాళుక్యనృపుల్," ( ప. 23 )

అను 23 వ పద్యమున సత్యాశ్రయాదులై న చాళుక్యరాజులు తెలుఁగు కవిత్వమును బుట్టించి వెలయఁజేసి రని చెప్పియున్నాఁడు. ఇక్కడ మార్గకవిత యనఁగా సంస్కృత కవిత్వ మని యర్థము. ** _________________________________________________________ ( * గున నిలిపి రంధ్ర విషయంబున చళుక్యరాజు మొదలుగఁబల్వుర్ − సరియైన పాఠము.) ( ** ఈ విషయమును గూర్చి మద్రాసు విశ్వవిద్యాలయమువారు ప్రకటించిన "కుమార సంభవము" యొక్క- 'పాఠ భేదములు-లఘు వ్యాఖ్య' లో నిట్లున్నది )