పుట:Aandhrakavula-charitramu.pdf/731

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనుమంచి భట్టు


ఈ కవి హయలక్షణసారమను నైదాశ్వాసముల గ్రంథమును రచించి కుమార కంపభూపాలున కంకితము చేసెను. ఇతఁడా శ్వాసముల కధికారము లని పేరు పెట్టెను. ఈ గ్రంథమునందు గుఱ్ఱముల మంచి చెడుగులును, వాని రోగలక్షణములును, రోగచికిత్సలును ఆవర్తవిశేషములును, గతిస్వరవివరణములును చెప్పఁబడినవి. ఇవి యన్నియు శాలిహోత్రునిసంస్కృతహయలక్షణానుసారముగాఁ జెప్పఁబడినట్టు కవి యీ క్రింది పద్యమునఁ దెలిపి యున్నాఁడు.

       చ. అనఘుఁడు శాలిహోత్రుఁడు హయంబులకు న్మును చెప్పినట్టి యా
           యనుపమలక్షణంబులు పయఃపరిమాణము రోమజంబులున్
           దెనుఁగున తెల్లవారలకుఁ దేటపడన్ రచియింతు సత్కవుల్
           విని కొనియాడ దానగుణవిశ్రుత ! కంపయమేదినీశ్వరా !

ఈ గ్రంధము మూఁడధికారములును నాల్గవయధికారములోనిరువదియైదు పద్యములును గల తప్పులతడిక యొకటి ముద్రింపఁబడియున్నది. గ్రంధాది నుండి పంచామాశ్వాసమున 103 పద్యములవఱకును గల ప్రతి యొకటి చెన్నపురిలో దొరతనమువారి ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమునందున్నది. ఈ రెండు ప్రతులలోను గూడ గ్రంథావతారికలేదు. అందుచేతఁ గృతిపతి కాలమునుగాని కృతికర్తకాలమునుగాని నిర్ణయించుటకుగలఁ యాధారములు గ్రంధములో నంతగాఁ గానరావు,

       క. క్రీడావర్తతురంగము
          వేడుక నెక్కంగఁ గోరువెఱ్ఱికి నూఱున్
          మూడుట నిక్కమ యని ము
          న్నాడిరి హయశాస్త్రవేదు లౌబళకంపా !

ఇత్యాది పద్యములలోఁ గృతిపతి యౌబళునిపుత్రుఁ డయినట్టు చెప్పబడెను . కృతిపతియైన కంపనరపాలుఁడు సాళువవంశజుఁడే యయినను గొన్నిస్థలము