పుట:Aandhrakavula-charitramu.pdf/712

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

685

దూ బ గుం ట నా రా య ణ క వి

             
             రామరఘురంతిసగరధర్మజదిలీప
             భోజసర్వజ్ఞసోమేశరాజసరణి
             ధాత్రిఁ బాలించెదమ్మభూధవసుతుండు
             శాశ్వతంబుగ బసవభూమీశ్వరుండు

ఇత్యాది పద్యములతో గ్రంధమునందుఁ గృతిపతి వర్ణింపఁబడెను. నెల్లూరి మండలములోని యుదయగిరియందు [1] కుంటమరాజు వల్లభయ్య కుమారుఁడు తమ్మరాజు 1460 వ సంవత్సరమున గోపాలకృష్ణ దేవాలయము కట్టించినట్టొక శిలాశాసనమువలనఁ దెలియవచ్చుచున్నది. ఈ తమ్మరాజే మనకృతిపతితండ్రియైన తమ్మరాజవి తోఁచుచున్నది. అతఁడే యితఁడయినపక్షమునఁ బసవనృపాలుని యింటిపేరు కుంటమరాజు వారనియు బసవనృపాలునికాలము 1470-80 సంవత్సరప్రాంతమనియు స్పష్టమగుచున్నది. ఈ బసవనృపాలునిమంత్రి యనంతయ గంగామాత్యుఁడు

          గీ. వసుధ నెగడిన మాధవవర్మవంశ
             వర్ధనుఁడగు తమ్మభూవరునిబసవ
             పార్థివున కాప్తుడై కృపాపాత్రుఁడగుచు
             ఘనత మెరసె ననంతయగంగవిభుఁడు.

అని దగ్గుపల్లి దుగ్గనకవి రచియించి గంగనామాత్యున కంకితముచేసిన నాచికేతూపాఖ్యానమునందుఁ జెప్పఁబడినది. ఈ దుగ్గనకవి శ్రీనాథ మహాకవి మఱఁది యగుటచేత నాచికేతూపాఖ్యానకర్తయు, భర్తయు పదునైదవ శతాబ్ది యుత్తరార్థమున నుండి యుండవలెను. ఈ యనంతయ గంగామాత్యునకే 1480-90 సంవత్సర ప్రాంతము నందుండిన నరసింహరాయనికి వరాహపురాణ మంకిత మొనర్చిన నంది మల్లన ఘంట సింగన కవులు ప్రబోధచంద్రోదయము నంకితము చేసిరి. ప్రబోధ చంద్రోదయమునందు

  1. [ కంఠమరాజని ఆంధ్రకవి తరంగిణి. (సం, 4 పుట 91 ).వీరు పూసపాటివారని శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావు గారు]