పుట:Aandhrakavula-charitramu.pdf/699

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

672

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

కృతిపతియైన గంగనామాత్యుని ప్రభువగు బసవనృపాలుఁడు దూబగుంట నారాయణకవి చేతఁ బంచతంత్రమును కృతినందియుండెను. బసవనృపాలుని కాలమును శాసనసహాయమునఁ దెలిసికొని నారాయణకవి చారిత్రమున నిర్ణయించి యున్నారము. దానినిబట్టి నాచికేతూపాఖ్యాన రచనాకాలము క్రీ. శ.
1460 ప్రాంతమని దుగ్గయకవి చారిత్రమునఁ జెప్పియుంటిని. ఈ ప్రబోధచంద్రోదయముకూడ నించుమించుగ 1480 ప్రాంతమున రచింపఁబడి యుండును. పెసరువాయాన్వయవంశాబ్ది చంద్రుఁడైన మన గంగయా మాత్యుఁడు ముందు జైమినిభారతకృతిపతియైన సాళువ నృసింహనృపాలుని సచివుఁడై యుండినట్టు ప్రబోధచంద్రోదయద్వితీయాశ్వాసాదిపద్యమువలన నెఱుఁగవచ్చును.

         క. శ్రీకరవీక్షణ ! దాన
            శ్రీకర ! నరసింహనృపవశీకర నయవి
            ద్యాకరణ ! చతుర్దశవి
            ద్యాకర ధీరంగమతి ! యనంతయగంగా !

[పయి పద్యమునుబట్టి గంగయామాత్యుఁడు కొంతకాలము సాళువ నృసింహ నృపాలుని సచివుఁడైనట్లు చెప్పుటకు వలనుపడదనియు, 'నరసింహనృపవశీకర నయవిద్యాకరణ' ఆను విశేషణముచే నృసింహరాయలను జీవగ్రాహముగాఁ బట్టించు గంగనామాత్యుని నయవిద్యాకరణ మహత్త్వమే వ్యక్త మగుచున్నదనియు, గంగనామాత్యుఁడుదయగిరి దుర్గాధిపతి యగు పురుషోత్తమ గజపతికి సామంతుఁడగు బసవనృపాలుని మంత్రియై యుండి తన ప్రభువుతోఁబాటు పురుషోత్తమ గజపతికి సాళువ నృసింహనృపాలునిఁ బట్టుకొనుటలో మిక్కిలి సాయపడి యుండుననియును శ్రీచాగంటి శేషయ్య గారి యభిప్రాయము. శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావు గారును, శ్రీ వీరేశలింగము పంతులుగారీ యభిప్రాయముతో నేకీభవించలేదు]

బ్రబోధచంద్రోదయ కర్తలు కొంతకాలము పిల్లలమఱ్ఱి పినవీరభద్ర కవిశిఖామణితో సమకాలీనులు. వీరు తమ ద్వితీయ గ్రంథమైన వరాహ పురాణమును కృష్ణదేవరాయలతండ్రియైన తుళువ నరసింహరాయని కంకిత