పుట:Aandhrakavula-charitramu.pdf/696

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నంది మల్లయ్య, ఘంట సింగయ్య


ఈ యిరువురు కవులును కలిసియే గ్రంథములను జేయుచు వచ్చిరి. వీరు చేసిన గ్రంథములలో ప్రధానములైనవి ప్రబోధచంద్రోదయమును, వరాహ పురాణమును. వీనిలో ప్రబోధచంద్రోదయము ననంతామాత్యుని పుత్రుఁడైన గంగయ్యమంత్రికిని, వరాహాపురాణమును కృష్ణదేవరాయల తండ్రి యైన నృసింహరాజునకును, వీ రంకితము చేసిరి. ఈ యిరువురు కవులలో మొదటివాడయిన నంది మల్లయ్యకు రెండవ కవియైన ఘంట సింగయ్య మేనల్లుడు. ఘంటసింగయ్యకు మలయమారుతకవి యని బిరుదాంకము గలదు. వీరిరువురకును గల బంధుత్వాదులు ప్రబోధచంద్రోదయములోని యీ క్రింది పద్యమువలనఁ దెలియ వచ్చుచున్నవి.

        సీ. కలరు కౌశికగోత్రకలశౌంబురాశిమం
                         దారంబు సంగీతనంది నంది
            సింగమంత్రికిఁ పుణ్యశీల పోతమ్మకు
                         నాత్మసంభవుఁడు మల్లయమనీషి
            యతని మేనల్లుఁ డంచితభరద్వాజగో
                         త్రారామచైత్రోదయంబు ఘంట
            నాగధీమణికిఁ బుణ్యచరిత్ర యమ్మలాం
                         బకుఁ గూర్మితనయుండు మలయమారు

            తాహ్వయుఁడు సింగనార్యుడు నమృతవాక్కు
            లీశ్వరారాధకులు శాంతు లిలఁ బ్రసిద్దు
            లుభయభాషల నేర్పరు లుపమరులు స
            మర్ధు లీ కృతిరాజనిర్మాణమునకు.

వీరు తమ యాశ్వాసాంతగద్యములలోఁ గూడ నుభయనామములను జేర్చుకొని