పుట:Aandhrakavula-charitramu.pdf/664

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

637

గౌ ర న మం త్రి

ముగా విశ్వసించి తన కన్న కూతురును ప్రజాహితార్థముగా మందసలోఁ బెట్టి దుఃఖముతో నేటినీటఁ ద్రోయింపఁగాఁ బ్రవాహ వేగముఁన గొట్టుకొని పోవుచున్న యా పెట్టెను పరిసరారణ్యమునందు వేఁటాడి డస్సి దప్పితీర్చుకొనుటకయి యేటియొడ్డునకు వచ్చిన యొక రాజకుమారుఁ డొడ్డునకుఁ బట్టించి తలుపులు తెఱచి దానిలో రెండవ రతీ దేవివలెఁ బ్రకాశించుచున్న యా రాచకన్నెను చూచి వలచి తద్వృతాంత మడిగి తెలిసికొని స్వర్ణాలంకార సహితముగా గాంధర్వవివాహమున నామెను పరిణయమయి యా మందసలోఁ దాను వేటాడి పట్టుకొన్న భల్లూకము నొకదానిని బెట్టి తలుపులు వేయించి యధాపూర్వముగా మందసను నదీ ప్రవాహానఁ దోపించెను. పెట్టె నెదురు చూచుచు నేటియొడ్డున దిగువను వేచియున్న శిష్యులు తమవంకకు వచ్చుచున్న పెట్టెను దరికి లాగి యొక సురక్షితస్థలమునఁ జేర్చి గురువురాకకు ప్రతీక్షించుచుండఁగా, నింతలో సంధ్యాసమయమున బ్రాహ్మణుఁ డక్కడకు వచ్చి చూచి సంతోషించి శిష్యులను శ్లాఘించి శిష్యులకు వేఱు పనులు కల్పించి వారి నందఱిని సాగనంపి తా నొంటిగా మందసను తెఱుచునప్పటి కందులో నున్న యెలుఁగుగొడ్డాతనిమీఁదఁ బడి కఱిచి కండలూడదీసెను. ఈ కథలోనిభాగము లక్కడక్కడివికొన్ని యిం దుదాహారింపఁబడుచున్నవి.

        ద్వి. చెడితిరా నిఁక నేమి చేయుదుఁ ననుచుఁ
             గడుపును బిసుకుచుఁ గటకటా ! యనుచు
             నిలిచినచో నొక నిమిషార్థమైన
             నిలువనోపక కూడు నీళ్ళును బాసి
             కడుజాలిఁ బొందుచుఁ గన్నంబులోన
             వడి తేలు కుట్టినవానిచందమున
             వెడఁగురీతిని కడు వేదనఁ జాల
             నడరుచు నొక యుపాయమును జింతించి

              * * * * * * *