పుట:Aandhrakavula-charitramu.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

594

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

పోయెనఁట ! భోజనము లయిన పిమ్మట శ్రీనాథుఁడు పోతనయొక్క దారిద్య్ర విషయమును ప్రస్తావించి భాగవతము [1]నొక రోజునకో ధనికునకో యంకితము చేయున ట్లొడబఱచుటకయి ప్రయత్నించు చున్నప్పుడు సరస్వతి యెదుట నిలిచి కన్నీరు పెట్టుకొనుచున్నట్లాతనికిఁ బొడకట్టఁగా పోతన

      ఉ. కాటుకకంటినీరు చనుకట్టుపయిం బడ నేల యేడ్చె దో
          కైటభదైత్యమర్దనునిగాదిలికోడల ! యో మదంబ యో
          హాటకగర్భురాణి ! నిను నాఁకటికిం గొనిపోయి యల్లక
          ర్ణాటకిరాటకీచకుల కమ్మఁ ద్రిశుద్దిగ నమ్ము భారతీ !

అని సరస్వతి నూఱార్చెనఁట. ఈ పద్యములోఁ గర్ణాటకిరాటకీచకులని చెవ్పుట శ్రీనాధుఁడు తన గ్రంధములను రాజులకును, కోమటులకును, దుష్టులకును, ధనమున కాశించి యమ్ముకొనె నని యాతని నాక్షేపించుట యని కొందఱభిప్రాయపడుచున్నారు. ఆ కాలమునం దాంధ్రరాజులను కర్ణాటరాజు లని చెప్పుచు వచ్చిరి. అందుచేతనే శ్రీనాథుఁడు భీమఖండమునందు

       గీ. ప్రౌఢ పరికింప సంస్కృతభాష యండ్రు
          పలుకు నుడికారమున నాంధ్రభాష యందు
          రెవ్వ రేమన్న నంద్రు నా కేలకొఱఁత ?
          నాకవిత్వంబుటు నిజము కర్ణాటభాష.

అని తన తెనుఁగుకవిత్వమును గర్ణాటభాషగాఁ జెప్పియుండెనఁట | ఇట్లు చెప్పుటకు వేఱు కారణము గలదు. అంతట శ్రీనాధుఁడు విఫల ప్రయత్నుఁడై మరలఁ దన యూరు చేరెనట! పోతన తన గ్రంథమును నరాంకితము చేయకపోవుటను గొప్పగా భాగవతమునందీ క్రింది పద్యముచేతఁ జెప్పుకొన్నాఁడు.

  1. [శ్రీనాధుడు భాగవతమును సర్వజ్ఞ సింగ భూపాలున కంకితమీయ వలెనని పోతనను గోరినట్లు కొందరు చెప్పుదురు.]