575
శ్రీనాథుఁడు
ధనవంతు లగువారి ధనమెల్ల దోఁచి
ముంజికాండ్రను జేసి మురిప మడంప
వ్యర్ధులై విటవృత్తి వసుమతిమీఁదఁ
బోయిరి బ్రతికెడుపొందిక లేక,
* * * * * * * * *
ద్విపద. నినుఁబాసి భువిమీదఁ నిల్వ నోపుదుమె
వనజాక్షి ! నీవెంట వత్తు మటంచు
నెరి బ్రాహ్మపుత్రుఁడు నీవిధి యనుచుఁ
గరియాన లిరువంకఁ గదిసి చల్లఁగను
భామ లందఱు గూడి పలుదెఱంగులను
గోమలిచరణంబు కొంత గై సేయఁ
జిలికికప్పిన మూర్చ తెలిసి శీఘ్రముగఁ
దలవంచి తనకాలు తప్పక చూచి
యిది యేరి బంగరం బింతచక్కనిది
యిది యెవ్వరిదె యమ్మ యీవులవెండి &c.
* * * * * * * * *
ఘనుఁడై న శ్రీనాథకవిరాజరాజు
చెన్నునికృపచేతఁ జిత్త ముప్పొంగి
బాలుని విక్రమ ప్రౌఢి యంతయును
విరచించె జనులకు విశదంబు గాను.
శ్రీనాథుఁడు పల్నాటివీరచరిత్రమును రచియించిన తరువాతనో రచింపక ముందో యొకసారి పల్నాటిసీమకుఁ బోయినట్టు తెలియవచ్చుచున్నది. అప్పు డాతఁడు స్వానుభవమునుబట్టి చెప్పిన పద్యములఁ గొన్నిటి నుదాహరించుచున్నాను.
క. రసికుఁడు పోవఁడు పల్నా
డెసఁగంగా రంభ యైన నేకులు వడుకున్
వసుధేశుఁ డైన దున్నును
గుసుమాస్త్రుండై న జొన్నకూడే కుడుచున్.