పుట:Aandhrakavula-charitramu.pdf/577

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

550

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

               సంతరించితి నిండుజవ్వనంబునయందు
                                హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
               బ్రౌఢనిర్ఫరవయఃపరిపాకమునఁ గొని
                                యాడితి భీమనాయకునిమహిమఁ

               బ్రాయ మింతకు మిగులఁ గై వ్రాలకుండఁ
               గాశికాఖఁడ నను మహా గ్రంధ మేను
               దెనుఁగుఁ జేసెదఁ గర్ణాటదేశ కటక
               పద్మవనహేళి శ్రీనాధభట్టసుకవి.

ఈ పద్యమునందు 'కర్ణాటదేశకటకపద్మవనహేళి' యని తనకు విశేషణము వేసికొని తాను గర్ణాటరాజ్యరాజధానియందు విద్యావిజయము నొంది యచ్చటి పండితులను సంతోష పెట్టితినని సూచించియున్నాఁడు. 'కర్ణాటదేశ కటకపద్మవన హేళి' యనఁగా కర్ణాటదేశరాజధాని యనెడు పద్మరాజికి సూర్యుఁ డని యర్ధము. సూర్యుఁ డెట్లు పద్మవనము నలరించునో, యట్లే తానును కర్ణాటకకటకవాసులైన బుధబృందము నలరించినవాఁడనని కవి యభిప్రాయము. ఇట్లు రాజాశ్రయబలమున ధైర్యమును వహించి కాశీ ఖండమునందు తన యాస్వాసాంతగద్యమున వెనుకటిగద్యములోని 'సకలవిద్యా సనాధ'కు మాఱుగా కవిసార్వభౌమవిశేషణమును దన పేరునకు ముందుఁబెట్టి 'సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాధనామధేయప్రణీతం' బని బహిరంగముగాఁ దాను కవిసార్వభౌముఁడ నని చెప్పుకొన సాహసించెను. అంతేకాక సప్తమా శ్వాసాంతపద్యములలో నొకదానియందుఁ గృతిపతిని సంబోధించుచు

         శా. కర్ణాటక్షితిపాలమౌక్తికసభాగారాంతరాకల్పిత
              స్వర్ణస్నానజగత్ప్రసిద్ధకవిరాట్సంస్తుత్యచరిత్ర ! దు
              గ్ధార్ణోరాశిగభీర! ప్రాహ్ణముఖ మధ్యాహ్నాపరాహ్ణార్చితా
              పర్ణావల్లభ ! రాజశేఖరమణీ ! పంటాన్వయగ్రామణీ !