పుట:Aandhrakavula-charitramu.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

519

శ్రీనాథుఁడు

ఇక మూడవ డిండిమకవిసార్వభౌమునిగూర్చి విచారింతము. ఇతఁడు ద్వితీయడిండిమకవిసార్వభౌముఁ డయిన యరుణగిరినాధుని పుత్రుఁడు; రాజనాథదేశికనామధేయుఁడు, తండ్రివలనను, తండ్రి తాతవలనను సంక్రమించిన డిండిమకవిసార్వభౌమబిరుదమును వహించినవాఁడు; మహావిద్వాంసుఁడయి సాళువాభ్యుదయాది గ్రంధములను రచించినవాఁడు. 1490-వ సంవత్సర ప్రాంతమున విద్యానగరరాజ్యమును వశపఱచుకొని పరిపాలించిన సాళువగుండనరసింహరాయని కాలములోను, తరువాతఁ [1] గృష్ణదేవరాయల తండ్రి యైన వీరనరసింహరాయనికాలములోను మూఁడవడిండిమకవిసార్వ భౌముఁడైన రాజనాథదేశికుఁ డాస్థానకవిగా నుండి ప్రసిద్దికెక్కెను. ఇతఁడు సాళువగుండ నరసింహరాయని విజయములను వర్ణించుచు సంస్కృతమున సాళవాభ్యుదయ మను పదునాలుగు సరములు గల కావ్యమును జేసెను, ఈ కావ్యమునం దితఁడు తా నష్టదిగ్విజయపటహీకృత బిరుద డిండమాడం బరుఁడ ననియు డిండిమకవిసార్వభౌముడ ననియుఁ జెప్పుకొనెను. ఈ బిరుదములీ వంశమువారికి పితృపితామహపారంపర్యముగా నడచుచున్నట్లు కనబడుచున్నవి. ఈ తృతీయ డిండీ మకవిసార్వభౌముఁడు వీరనరసింహాదేవరాయనికాలములోఁ గూడ నుండినట్టు కుమారధూర్జటికవి కృత మయిన కృష్ణరాజవిజయములోని యీ క్రింది పద్యములు తెలుపుచున్నవి.

     మ. రమణీయాంధ్రతరంగిణీఘుమఘుమారావార్థగంభీరవా
         క్క్రమఝంఝానిలధూతదుష్కవిమహాగర్వాభ్రసంఘుండు ది
         గ్రమణీమౌక్తికహారబంధురయశో రాజద్గుణాఢ్యుండు డిం
         డిమపుంభావసరస్వతీంద్రుఁ డనియెన్ ఠీవిం బ్రకాశించుచున్.

* * * *

  1. [కృష్ణదేవరాయల తండ్రి సరసరాయలు కాని వీరనరసింహ రాఁయలు కాఁడు; వీర నరసింహరాయలు కృష్ణరాయల యన్న.]