పుట:Aandhrakavula-charitramu.pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

493

శ్రీనాథుఁడు

యగుటయం దెక్కువ యిష్టము కలిగి యుండినట్టు కనుపట్టుచున్నది. వేమభూపాలుఁడు సంస్కృతాంధ్రములయందు మంచి పాండిత్యము కలవాఁడయినట్టు చెప్పుచున్నారు. అమరుక మను శృంగార కావ్యమునకు సంస్కృతమున శృంగారదీపిక యను వ్యాఖ్యానము నీతఁడు రచించెను. ఈ గ్రంథ రచనమునందు శ్రీనాథ వామనభట్టు లీతని సహాయులుగా నుండి నట్టు కొందఱును, శ్రీనాధుఁడే గ్రంథము నంతను వేమభూపాలుని పేరు పెట్టి రచించెనని కొందఱును చెప్పుచున్నారు. శ్రీనాధుఁని శాసనములలో శ్లోకములే భేద మించుకయు లేక సరిగా నిందుఁగనఁబడుచున్నందున శ్రీనాధుఁడే శృంగారదీపికను రచించి యుండును. [1]ఫిరంగిపురశాసనము 1410 -వ సంవత్సరమునందు శ్రీనాథునిచే రచింపఁబడినది. ఇది గుంటూరు మండలము లోని సత్తెనపల్లి తాలూకా యందలి ఫిరంగిపుర గ్రామమున శ్రీ వీరభద్ర స్వామివారి యాలయమున కెదుట సున్న శిలా స్తంభముమీఁదఁ జెక్కఁ బడినందున నీ శిలా శాసనము ఫిరంగిపుర శాసన మనcబడును. ఇది ధరణికోటకు ప్రభువయిన గన్నమనాయని కూఁతురును వేమభూపాలుని భార్య యును నై సూరాంబ త్రవ్వించిన సంతానసాగర మను చెఱువును శకసంవత్సరము 1331 విరోధిసంవత్సర ఫాల్గుణ బహుళ ద్వితీయా శుక్రవారమునఁ బ్రతిష్టచేయు సందర్భమున శ్రీనాథునిచే రచియింపఁబడినది. ఈ సంతాన సాగర ప్రతిష్ఠాతిథి క్రీస్తుశకము 1410-వ సంవత్సరము ఫిబ్రవరి నెల 21-వ తేదీ యగును. ఈ శాసనము నిందు క్రిందఁ బూర్ణముగాఁ బ్రకటించుచున్నాను.

పడమటివైపు.

      శ్లో. కళ్యాణం జగతాం తనోతు స విభుః కాదంబినీ మేచకః
         క్రీడాక్రోడతనుః పయోధిపయసో విశ్వంభరా ముద్వహన్
         భారాపేతఫణావివర్తనవశా న్మోదాయ య స్యాభవన్

  1. [ఈ గ్రంథమును రచించుటలో శ్రీనాధుఁడు సాయపడి యుండునని పలువురి యభిప్రాయము]