పుట:Aandhrakavula-charitramu.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడి ప్రజల ప్రార్ధనముచేతఁగాని, దేశచరిత్రాభిమానముచేతఁగాని ఈ చరిత్రమును రచించి యుండునని శ్రీ శాస్త్రులుగారి యాశయము. [చూ. శృంగార శ్రీనాధము. పుట. పుట 240]

ఈ పుస్తకమువలనఁ గలిగిన ప్రోత్సాహమునుబట్టి శ్రీనాధుఁడు గొప్పవారికిఁ గృతు లిచ్చి ధనార్థనము చేయవచ్చునన్న యాశ గలవాఁడయి స్వగ్రామమును విడిచి స్వస్థలమునకు మిక్కిలి సమీపమున నున్న యొక చిన్న సంస్థానమునకుఁ బోయెను. ఆ సంస్థానమున కప్పు డధిపతి పెద్ద కోమటి వేముడు, అప్పు డాతని ముఖ్యపట్టణము దువ్వూరో, యేదోయయి యుండును. ఎంతటి విద్వాంసుల కయినను రాజమంత్రి యొక్కయు, తదితరోద్యోగులయొక్కయు ననుగ్రహము లేక రాజదర్శన మగుటయు, రాజానుగ్రహమునకుఁ బాత్రుఁడగుటయు సంభవింప నేరవు. అందుచేత శ్రీనాథుఁడు పెద్దకోమటి వేమనమంత్రి యైన మామిడి సింగన్న యైన ప్రెగడన్న నాశ్రయించి యాతనికిఁ బండితారాధ్యచరిత్ర మంకితమొనర్చెను. అప్పటికీ పెద్దకోమటివేమన్న యొక చిన్నసంస్థానాధిపతి యయి కొమరగిరిరెడ్డి రాజ్యకాలములో నుండినవాఁడు. పెద్దకోమటి వేమభూపాలుఁడు రెడ్డిరాజ్యసంస్థాపకుడైన ప్రోలయవేమారెడ్డియన్నయైన మాచన్నయొక్కరెండవ కుమారుని కుమారుఁడు. మాచన్నయొక్క ప్రధమపుత్రుఁడు రెడ్డిపోతన నృపాలుడు; ద్వితీయ పుత్రుఁడు పెద్దకోమటి భూపాలుఁడు; తృతీయపుత్రుఁడు నాగనరపాలుఁడు. ఈ యంశమును శృంగారదీపికలోని యీ శ్లోకము తెలుపుచున్నది.

            శ్లో. మాచక్షోణిపతిర్మహేంద్రవిభవో వేమక్షితీశాగ్రజో
               హేమాద్రేస్సదృశో బభూవ సుగుణైస్తస్య త్రయో నందనాః
               కీర్త్యా జాగ్రతి రెడ్డిపోతనృపతి శ్శ్రీకోమటీంద్రస్తతో
               నాగక్ష్మాపతి రిత్యువాత్తవపుషో ధర్మార్థకామా ఇవ.

మాచన్న యొక్క చిన్న సంస్థానమునకు తండ్రి యనంతరమున నాతని పెద్ద కొడుకు రెడ్డిపోతభూపాలుఁడు రాజయ్యెను; రెడ్డిప్రోతభూపాలుని యనం