పుట:Aandhrakavula-charitramu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23

న న్న య భ ట్టు


కాని యిట్లూహించుట సరికాదు. నన్నయ, తిక్కనలు సమకాలికులు కానందునను. వీరిర్వురికిని నడుమ రెండు శతాబ్దులకాలము వ్యవధానముండుటఁ బట్టియు యూహ యుక్తము కాదు.

అరణ్యపర్వము కొంతవఱకునువ్రాయునప్పటికి నన్నయ మృతిఁ జెందెనని కాని, అతనికిఁ జిత్తవిభ్రాంతి కలిగెనని కాని కొందఱందురు.

నన్నయభట్టు మృతికిఁ బూర్వమే రాజరాజు మరణించుటవలనను, ఆతని కుమారుఁడగు కులోత్తుంగచోడుఁడు దక్షిణదేశమునందే యుండుటవలన, అతని కాంధ్రభాషయం దభిమానము లేకుండుటవలనను నన్నయభట్టునకు విరక్తి కలిగి భారతరచన నిలిచిపోయి యుండవచ్చునని ' ఆంధ్రకవి తరంగిణి" రచయిత లభిప్రాయ పడుచున్నారు.

నన్నయ భారతరచనను క్రీ. శ. 10-11 శతాబ్దుల నడుమ సాగించెనని "ఆంధ్ర కవి తరంగిణి" లోఁ గలదు. (పుట. 18] కీ శే నడకుదుటి వీరరాజుగారు, నన్నయ క్రీ. శ. 1055 ప్రాంతమున మరణించెనని యభిప్రాయపడిరని, అందే తెల్పcబడినది. భారతరచన క్రీ. శ 1025-1030 ల నడుమ జరిగిన దనియు, నన్నయభట్టు నందంపూఁడి శాసనరచయితకంటె భిన్నుఁడనియు శ్రీమారేమండ రామారావుగా దభిప్రాయపడుచున్నారని "ఆంధ్రకవితరంగిణి' [పుట 14 లో దెల్పఁబడినది.]

ఆంధ్ర భారతరచనారంభకాలమునం దాంధ్ర దేశమునకుఁ బ్రభువుగా నుండిన రాజనరేంద్రుని యొక్క పూర్వులరాజ్యక్రమము నిందు సంక్షిప్తముగాఁ దెలుపుట యనావశ్యకము కాదు. విష్ణుశర్మ చేత సంరక్షింపఁబడి చళుక్య పర్వతమున గౌరిని గూర్చి తపస్సుచేసి సేనలను గూర్చుకొనివచ్చి దక్షిణ హిందూస్థానము నంతను జయించిన (విజయాదిత్యపుత్రుఁడగు) విష్ణువర్ధనుఁడు తాను పొందిన జయములను బట్టి జయసింహుఁడను బిరుద నామమును బొందినట్టు కనఁబడుచున్నది. ఈ విజయములు నాల్గవశతాబ్దాంతమున జరిగి యుండును. ఇతఁడు కాంచీపురము రాజధానిగాఁ గల పల్లవరాజు కొమార్తెను వివాహ మాడి, యామెవలన విజయాదిత్యుఁ డనుకుమారుని గనెను. ఈ విజయాదిత్యునికి రణరాగుఁడను బిరుదనామము కలదఁట.