పుట:Aandhrakavula-charitramu.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

347

నా చ న సో ముఁ డు

సోమనాధునికవిత్వము మిక్కిలి ప్రౌఢముగాను, సర్వవిథముల నెఱ్ఱాప్రెగడ కవిత్వమునకంటె మేలైనదిగాను ఉన్నది. ఒక్క యెఱ్ఱాప్రెగడకవిత్వమే కాదు. భారతమును రచించిన కవిత్రయములో ననేకులకవిత్వమును గొన్ని విషయములలో సోమునికవనముతో సరి రాదని నా యభిప్రాయము.[1]

ఇతనికవిత్వపటుత్వసంపదనుబట్టి యీతనికి సర్వజ్ఞుడని బిరుదుపేరు వచ్చినది. ఆపేరున కీతఁడు తప్పక తగినవాఁడే. ఇటీవల నితనికాలమును దెలిపెడి తామ్రశాసన మొకటి దొరికినది. అది బుక్కదేవరాయల రాజ్యకాలములో నాచన సోమనకును, మఱి యైదుగురు బ్రాహ్మణులకును గలిపి రాజొకగ్రామము నగ్రహారముగా నిచ్చినప్పడు పుట్టిన శాసనము. ఈ శాసనమునుబట్టి యితఁ డాపస్తంభసూత్రుఁడనియు, భారద్వాజ గోత్రుడనియు యజుశ్శాఖవాఁడనియు సకలాగమవేది యనియు నష్టాదశ పురాణార్ధ విదుఁడనియు నష్టభాషాకవిత్వరచనా విశారదుఁ డనియు నాచనకులాంభోధిసోముఁ డనియుఁ దెలియవచ్చు చున్నది. ఈ శాసనము నిచ్చటఁ బూరముగా వ్రాయుచున్నాను. ఇది మైసూరురాజ్యములోని కోలారు మండలమునందలి హోబ్లీరామపురపు పటేలయిన జటావల్లభుఁ డను విప్రునినుండి గైకొనఁబడి ఎఫిగ్రాఫికాకర్ణాటికాలో జీ. డీ. 46 వ సంఖ్యను బ్రకటింపఁబడిన తామ్రశాసనము.

                          శ్రీగణాధిపతయే నమః
   
    శ్లో. నమ సుంగశిరశ్చుంబిచన్ద్రచామరచారవే,
        తైలోక్యనగరారంభమూల స్తభాయ శంభమే. 1
        
        ఆవ్యా దవ్యాహతైశ్వర్యకారణో వారణాననః
        వరద స్తీవ్రతిమిరమిహిరో హరనందనః. 2

  1. [ఎఱ్ఱాప్రెగడ కవిత్వముకంటే సోముని కవిత్వమే ప్రశస్తతరమని శ్రీబహుజనపల్లి సీతారామాచార్యులు గారు, నడకుదుటి వీరరాజుగారు మున్నగువారి యభిప్రాయము. ఎఱ్ఱనకవిత ప్రశస్తతరమని శ్రీరాళ్లపల్లి ఆనంత కృష్ణశర్మగారు మున్నగు వారి యాశయము.]